EPF 2026 అమల్లోకి: డబ్బులు ఎన్నిసార్లు తీసుకోవచ్చో తెలుసా?
ఉద్యోగుల భవిష్య నిధి (EPF) నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాల కాలంగా అమల్లో ఉన్న పాత నిబంధనల స్థానంలో, ఆధునిక అవసరాలకు అనుగుణంగా 'ఈపీఎఫ్-2026 (FPF - 2026)' 'ఈపీఎస్-2026 (EPS -2026)' పథకాలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ఈపీఎఫ్వో కేంద్ర ట్రస్టీ బోర్డు నిర్ణయించింది. ఉద్యోగుల సామాజిక భద్రతను పెంచుతూనే, అత్యవసర సమయాల్లో నిధులను విత్డ్రా చేసుకునే వెసులుబాటును ఈ కొత్త విధానం కల్పిస్తోంది.
EPF: కొత్తగా అమల్లోకి రానున్న 'కనీస నిల్వ' నిబంధన:
కొత్త నిబంధనల ప్రకారం, ఉద్యోగి తన పీఎఫ్ ఖాతా నుండి డబ్బు విత్డ్రా చేయాలనుకున్నప్పుడు, మొత్తం నిధిలో కనీసం 25 శాతం మొత్తాన్ని రిజర్వ్గా ఉంచాలి. అంటే, క్లెయిమ్ చేసే సమయానికి ఉద్యోగి, యజమాని వాటాలు మరియు వాటిపై వచ్చిన వడ్డీ కలిపి ఎంత మొత్తం ఉందో లెక్కించి.. అందులో 25 శాతం మినహాయించి, మిగిలిన 75 శాతం మొత్తాన్ని మాత్రమే ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తారు. భవిష్యత్తు అవసరాల కోసం పీఎఫ్ ఖాతాలో ఎంతో కొంత నిల్వ ఉండాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను తీసుకువచ్చారు.

ఉపసంహరణల సంఖ్య పెంపు - కీలక కేటగిరీలు:
ఉద్యోగుల అవసరాలను బట్టి విత్డ్రా చేసుకునే అవకాశాలను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది.
- కేటగిరీ-1 (అనారోగ్యం, విద్య, పెళ్లి): ఉద్యోగంలో చేరిన ఏడాది తర్వాత అనారోగ్య కారణాల కోసం సంవత్సరానికి మూడుసార్లు క్లెయిమ్ చేసుకోవచ్చు. పిల్లల చదువుల కోసం సర్వీసు కాలంలో 10 సార్లు, వివాహాల కోసం 5 సార్లు విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.
- కేటగిరీ-2 (ఇల్లు & రుణాలు): ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా లేదా హోమ్ లోన్ చెల్లించాలన్నా ఇప్పుడు 5 సార్లు పీఎఫ్ నిధులు వాడుకోవచ్చు (గతంలో ఇది కేవలం 2 సార్లు మాత్రమే ఉండేది). దీనికి కనీసం 12 నెలల సర్వీసు ఉండాలి.
- కేటగిరీ-3 (ప్రత్యేక సందర్భాలు): అత్యవసర పరిస్థితుల్లో ఏడాది సర్వీసు పూర్తికాకపోయినా, కనీస నిల్వ మినహాయించి నగదు పొందే వెసులుబాటు కల్పించారు.
యజమాని వాటాపై కఠిన ఆంక్షలు..
ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. యజమాని చెల్లించాల్సిన పీఎఫ్ వాటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగి జీతం నుండి మినహాయించకూడదు. ఒకవేళ యజమాని తన వాటాను ఉద్యోగి జీతం నుండి కట్ చేసినా లేదా తిరిగి వెనక్కు తీసుకున్నా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అలాగే 55 ఏళ్లు నిండిన వారు లేదా విదేశాలకు వెళ్లే వారు తమ పీఎఫ్ మొత్తాన్ని పూర్తిగా విత్డ్రా చేసుకునే పాత వెసులుబాటు యథాతథంగా కొనసాగుతుంది.
పెన్షన్ ఖరారులో కొత్త విధానం..
పెన్షన్ (EPS) లెక్కించే విధానంలో కూడా మార్పులు రానున్నాయి. కొత్త పథకం ప్రకారం 'దామాషా పద్ధతి' (Pro-rata basis) లో పెన్షన్ ఖరారు చేయనున్నారు. ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్న ఈ కొత్త గెజిట్ ద్వారా పీఎఫ్ ఖాతాదారులకు మరింత పారదర్శకత, భద్రత చేకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది.












Click it and Unblock the Notifications