Gold Price Today: రికార్డు స్థాయిలో బంగారం ధరలు.. పెరుగుదలకు అసలు కారణం ఇదే!
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తుఫానులా ఊగిసలాడుతుంటే, బంగారం మాత్రం మెరుపులా దూసుకుపోతోంది! సోమవారం ఒక్కరోజే పసిడి ధరలు ఔన్సుకు ఏకంగా $3,106 డాలర్లను తాకి సరికొత్త శిఖరం నెలకొల్పాయి. భౌగోళిక రాజకీయాల అలజడులు, ఆర్థిక భయాందోళనలు పెరిగిపోతుండటంతో, పెట్టుబడిదారులు సురక్షితమైన స్వర్గధామంగా భావించి బంగారం వైపు పరుగులు తీస్తున్నారు.
ఈ సంవత్సరం మొదలైనప్పటి నుండి చూస్తే, బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే 18 శాతం మేర పెరగడం అంటే మామూలు విషయం కాదు! సామాన్యుల నుండి పెద్ద ఇన్వెస్టర్ల వరకు అందరూ బంగారం కోసం ఎగబడుతుండటంతో డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. ఈ ఊపు చూసి ప్రముఖ ఆర్థిక దిగ్గజాలైన గోల్డ్మాన్ సాక్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA), UBS వంటి సంస్థలు సైతం తమ బంగారం ధరల అంచనాలను ఒక్కసారిగా మార్చేశాయి.

అంచనాలకు మించి పెరుగుతున్న పసిడి ధరలు
బ్యాంక్ ఆఫ్ అమెరికా (BofA) గ్లోబల్ రీసెర్చ్ నివేదిక సంచలన అంచనాతో ముందుకొచ్చింది. రాబోయే 18 నెలల్లో బంగారం ధర ఔన్సుకు ఏకంగా $3,500 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. వాణిజ్యేతర కొనుగోళ్లు ఊపందుకుని 10 శాతం పెరిగితే ఈ స్థాయిని అందుకోవడం ఖాయమని తేల్చి చెప్పింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ ఖజానాలను పటిష్టం చేసుకోవడానికి బంగారాన్ని మరింతగా కొనుగోలు చేసే అవకాశం ఉందని, సగటున 10 శాతం నుండి 30 శాతానికి తమ బంగారు నిల్వలను పెంచుకోవచ్చని అంచనా వేసింది.
కాసుల వర్షం కురిపిస్తున్న బంగారం
భారతదేశంలో 2024లో బంగారం పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపించింది. అత్యుత్తమ రాబడినిచ్చిన ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 21 శాతం రాబడితో ఇన్వెస్టర్లను ఊర్రూతలూగించింది. దీంతో భారతీయ మార్కెట్లో బంగారం పెట్టుబడులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. గోల్డ్ ETFలలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తడమే దీనికి నిదర్శనంగా భావిస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రైవేట్ వెల్త్ నివేదిక ప్రకారం, 2024లో భారతీయ గోల్డ్ ETFలు రూ. 112 బిలియన్ల నికర పెట్టుబడులతో కళకళలాడాయి. ఫలితంగా 15 టన్నుల బంగారం నిల్వలు పెరిగి, సంవత్సరాంతానికి ఏకంగా 57.8 టన్నులకు చేరుకున్నాయి. ఇది బంగారానికి భారతీయులు ఎంతగా పట్టం కడుతున్నారో చెప్పకనే చెబుతోంది.
టన్నుల కొద్ది పెరుగుతున్న బంగారం నిల్వలు
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సైతం బంగారం కొనుగోళ్లలో దూకుడును కొనసాగించింది. 2024లో ఏకంగా 72.6 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి తన నిల్వలను మరింత పెంచుకుంది. దీంతో ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం బంగారం నిల్వలు 876 టన్నులకు చేరుకున్నాయి. ఆర్బీఐ వరుసగా ఏడవ సంవత్సరం నికరంగా బంగారాన్ని కొనుగోలు చేయడం విశేషం. ప్రస్తుతం, ఆర్బీఐ విదేశీ మారక నిల్వలలో బంగారం వాటా 10.6 శాతానికి పెరిగింది.
బంగారం ధరలు మండిపోతుండటంతో నగల కొనుగోళ్లు కాస్త నెమ్మదించినా, భౌతిక బంగారం అంటే కడ్డీలు, నాణేల రూపంలో పెట్టుబడులు మాత్రం ఏమాత్రం తగ్గలేదు. డిమాండ్ ఇంకా బలంగానే కొనసాగుతోంది. బంగారం దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టడానికి మంచి ఆస్తి అని, పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉండాలని సూచిస్తున్నారు. అయితే, వెండి కూడా ఇప్పుడు మంచి అవకాశంగా కనిపిస్తోందని, వ్యూహాత్మక పెట్టుబడులకు వెండిని కూడా పరిశీలించమని సలహా ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications