దిగొచ్చిన బంగారం ధరలు! మూడు రోజుల తర్వాత యూ టర్న్
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఒడిదుడుకుల వల్ల స్టాక్ మార్కెట్లతో పాటు బంగారం ధరలు విపరీతంగా అస్థిరతకు గురయ్యాయి. అయితే, గత మూడు రోజుల వరుస పెంపునకు చెక్ పెడుతూ.. నేడు దేశీయ మార్కెట్లో బంగారం ధరలు శాంతించాయి. ఈ స్వల్ప తగ్గుదల కొనుగోలుదారులకు, ముఖ్యంగా ఇంట్లో శుభకార్యాలు ఉన్నవారికి కొంత ఊరటనిస్తోంది.
బుధవారం నాటి ట్రేడింగ్లో అన్ని రకాల క్యారెట్ల బంగారంపై స్పష్టమైన కోత కనిపించింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి గ్రాముపై రూ.22 తగ్గి రూ.16,375 వద్దకు చేరగా, ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం గ్రాముపై రూ.20 తగ్గి రూ.15,010 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 18 క్యారెట్ల గ్రాము పసిడి ధర రూ.12 తగ్గి రూ.12,281 వద్ద నమోదైంది. వ్యాపారాల పరంగా చూస్తే.. 100 గ్రాముల 24 క్యారెట్ల తులం బంగారంపై ఒకే రోజు ఏకంగా రూ.2,200 మేర తగ్గింపు లభించింది. మరోవైపు వెండి ధరలు తటస్థంగా ఉన్నాయి. నేటి రేటులో ఎలాంటి మార్పు లేకుండా గ్రాము రూ.265 వద్ద ఉండగా.. కేజీ రూ.2,65,000 వద్ద నిలిచింది.

తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఇది!
మన తెలుగు రాష్ట్రాలలోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బంగారం ధరలు ఒకే రీతిగా కొనసాగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.220 తగ్గి రూ.1,63,750 వద్ద స్థిరపడింది. ఇక ఆభరణాల ప్రియులు ఎక్కువగా కొనుగోలు చేసే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గి రూ.1,50,100 వద్దకు చేరింది. ముంబై, బెంగళూరు, కోల్కతా వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా సరిగ్గా ఇదే తరహా ధరలు పలికాయి.
ఢిల్లీ, చెన్నై నగరాల్లో భిన్నమైన ట్రెండ్
దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ.1,63,900గా ఉండగా, 22 క్యారెట్లు రూ.1,50,250 వద్ద అమ్ముడవుతోంది. మరోవైపు చెన్నైలో 24, 22 క్యారెట్ల ధరలు తెలుగు రాష్ట్రాల తరహాలోనే ఉన్నప్పటికీ, 18 క్యారెట్ల బంగారం మాత్రం 10 గ్రాములకు రూ.1,27,800 వద్ద కాస్త భిన్నంగా నమోదైంది. అహ్మదాబాద్లో 24 క్యారెట్ల తులం బంగారం రూ.1,63,800 వద్ద ట్రేడ్ అవుతోంది.
ముందుంది మళ్లీ ధరల వేడి?
ప్రస్తుతానికి ధరలు కాస్త తగ్గుముఖం పట్టి నిరంతర పెంపు నుంచి ఉపశమనం ఇచ్చినప్పటికీ, ఇది తాత్కాలికమే కావచ్చునని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో దౌత్యపరమైన ఒత్తిళ్లు, యుద్ధ భయాలు గనుక మరింత ముదిరితే, సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు పెట్టుబడిదారులు మళ్లీ మొగ్గు చూపుతారు. ఫలితంగా రాబోయే రోజుల్లో పసిడి ధరలు మళ్లీ కొత్త రికార్డుల వైపు పుంజుకునే అవకాశముందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.














Click it and Unblock the Notifications