ఒక్క మాటతో కుప్పకూలిన మార్కెట్లు, రూ.10 లక్షల కోట్లు ఆవిరి
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం రక్తసిక్తంగా మారాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడిచమురు ధరల మంట ఇన్వెస్టర్ల కొంపముంచాయి. వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలు కొనసాగడంతో దలాల్ స్ట్రీట్ అతలాకుతలమైంది.
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1,456.04 పాయింట్లు (1.92%) పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా 436.30 పాయింట్లు (1.83%) కోల్పోయి 23,379.55 వద్ద ముగిసింది. గత ఆరు వారాల్లో మార్కెట్లకు ఇది అత్యంత దారుణమైన రోజుగా నిలిచింది. ఫలితంగా మార్కెట్ విలువ రూ.10 లక్షల కోట్లు తగలబడిపోయాయి. కేవలం రెండు రోజుల్లోనే మార్కెట్ విలువ 3.4 శాతం ఆవిరైపోయింది.

మార్కెట్ పతనానికి ప్రధాన కారణాలు:
ముడిచమురు సెగ:
బ్రెంట్ క్రూడ్ ధర 2.45 శాతం పెరిగి బ్యారెల్కు 106.75 డాలర్లకు చేరింది. చమురు ధరలు పెరిగితే మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి, కంపెనీల ఆదాయాలపై దెబ్బ పడుతుందనే భయం ఇన్వెస్టర్లను వణికించింది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు:
ఇరాన్తో కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తోసిపుచ్చడం, యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లు కుదేలయ్యాయి.
ఐటీ షేర్ల పతనం:
OpenAI కొత్త ఏఐ కంపెనీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు 4 శాతం వరకు పడిపోయాయి.
రూపాయి రికార్డు పతనం:
ముడిచమురు ధరల ప్రభావంతో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 35 పైసలు తగ్గి, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 95.63కి పడిపోయింది.
విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ:
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) సోమవారం ఒక్క రోజే రూ. 8,437.56 కోట్ల విలువైన షేర్లను విక్రయించడం మార్కెట్ను మరింత కుంగదీసింది.
లాభపడిన రంగాలు ఇవే..
మార్కెట్ మొత్తం ఎరుపు రంగులో ఉన్నా.. ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఓఎన్జీసీ (6%), ఆయిల్ ఇండియా (6.6%) షేర్లు మాత్రం లాభపడ్డాయి. ప్రభుత్వం రాయల్టీ తగ్గించడమే వీటికి కలిసొచ్చింది. ఇక ప్రధాని మోడీ పిలుపుతో జ్యువెలరీ, బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లలో వరుసగా రెండో రోజు అమ్మకాలు కొనసాగాయి.
మొత్తానికి, యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితి మధ్య ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.














Click it and Unblock the Notifications