ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. 80 శాతం బోనస్ !
ప్రముఖ ఐటీ దిగ్గజం "ఇన్ఫోసిస్" ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న ఈ కంపెనీ.. ఏప్రిల్-జూన్ (Q1FY2025-26) త్రైమాసికానికి అర్హులైన ఉద్యోగులకు పనితీరు ఆధారిత బోనస్లు ఇవ్వనుంది. ఆగస్టు జీతంతో పాటు ఈ బోనస్లు చెల్లించనున్నట్లు సమాచారం. ఈసారి సగటు బోనస్ 80 శాతంగా నిర్ణయించగా.. వ్యక్తిగత పనితీరు ఆధారంగా 75 శాతం నుంచి 89 శాతం వరకు ఉద్యోగులు పొందనున్నారు.
ముఖ్యంగా లెవల్ పీఎల్4, పీఎల్5, పీఎల్6 కేటగిరీల్లో ఉన్న సిబ్బందికి ఈ బోనస్ వర్తించనుంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఎల్4 ఉద్యోగులు గరిష్టంగా 89శాతం బోనస్ పొందనున్నారు. పీఎల్5 ఉద్యోగులకు 78-87 శాతం, పీఎల్6 ఉద్యోగులకు 75-85 శాతం మధ్య బోనస్ లభిస్తుంది. పనితీరులో లోటు ఉన్నవారికి కూడా కనీసం 70 శాతం నుంచి 80శాతం వరకు బోనస్ ఇచ్చేలా కంపెనీ నిర్ణయించింది.

ఇన్ఫోసిస్ అంతర్గత మెమో ప్రకారం, బోనస్ లెటర్లు ఇప్పటికే ఉద్యోగుల ఇ-డాకెట్స్లో అప్లోడ్ చేయబడ్డాయి. ప్రతి ఉద్యోగి పనితీరు, టీమ్కు చేసిన సహకారం ఆధారంగా బోనస్ శాతం మారుతుందని స్పష్టం చేసింది. డెలివరీ మేనేజర్లు బోనస్లను కేటాయించి, టీమ్ సభ్యులకు వాటిని పంపిణీ చేశారు.
గత మార్చి త్రైమాసికంలో బోనస్ తక్కువగా రావడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. కొంతమంది 50 శాతం మాత్రమే పొందగా.. కొందరికి 70 శాతం లభించింది. అయితే ఈసారి మంచి ఆర్థిక ఫలితాల నేపథ్యంలో గణనీయంగా ఎక్కువ బోనస్ ఇచ్చారు.
ఇన్ఫోసిస్ జూలై 23న ప్రకటించిన ఫలితాల ప్రకారం, సంస్థ నికర లాభం గతేడాదితో పోలిస్తే 8.7శాతం పెరిగి రూ.6,921 కోట్లకు చేరింది. ఆదాయం కూడా 7.5శాతం వృద్ధితో రూ.42,279 కోట్లుగా నమోదైంది. రెండు రంగాల్లోనూ అంచనాలను మించి ప్రదర్శించింది. దాంతో ఉద్యోగుల ప్రోత్సాహకానికి భాగంగా, ఇన్ఫోసిస్ ఫిబ్రవరిలో వేతన సవరణలు అమలు చేసి, చాలా మందికి 5-8 శాతం జీతం పెంచింది.
అలాగే ఇటీవలే కొంతమంది ఉద్యోగులకు పదోన్నతులు కూడా కల్పించింది. సాధారణంగా ఈ సంస్థలో ఉద్యోగులు ప్రతి నాలుగేళ్లకోసారి ప్రమోషన్ పొందుతారు. సంస్థాగత లక్ష్యాలకు అనుగుణంగా, పనితీరు ఆధారిత సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామని, బోనస్ చెల్లింపుల్లో వ్యత్యాసాన్ని కొనసాగించామని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులలో మళ్లీ సానుకూల వాతావరణం ఏర్పడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications