అపర కోటీశ్వరుడు.. కానీ ఒక్క నిమిషం మాత్రమే!
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలోని ధామ్నోద్ నుంచి ఓ విస్మయకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగా నోటరీ న్యాయవాది, పాఠశాల నిర్వాహకుడు అయిన వినోద్ డోంగ్లే కొద్ది క్షణాల్లోనే అపర కోటీశ్వరుడిగా మారిపోయారు. వినోద్ డోంగ్లే తన డీమ్యాట్ ఖాతాలో అకస్మాత్తుగా రూ. 2817 కోట్ల మొత్తం కనిపించేసరికి ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సంఘటన శుక్రవారం నాడు ఆయనకు చెందిన ఎన్జే డీమ్యాట్ ఖాతాలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా జరిగింది. వినోద్ డోంగ్లే తన ఖాతాను లాగిన్ చేసినప్పుడు అతని వద్ద ఉన్న హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీకి చెందిన 1312 షేర్ల విలువ పెరిగినట్లుగా చూపించింది.
సాంకేతిక లోపం కారణంగా ఒక్కో షేరు ధర రూ. 2 కోట్ల 14 లక్షల 74 వేలకు పైగా (రూ. 2,14,74,000) నమోదైంది. దీనితో మొత్తం షేర్ల విలువ సుమారు రూ. 2817 కోట్లుగా కనిపించింది. ఇంత పెద్ద మొత్తాన్ని చూసిన వినోద్ డోంగ్లే మొదట్లో నమ్మలేకపోయారు. కొద్ది క్షణాల పాటు తన అదృష్టం మారిందని, తన కల నిజమైందని భావించారు. వినోద్ డోంగ్లే ఈ విషయాన్ని వివరిస్తూ.. "శనివారం కోర్టు నుంచి రాగానే నా డీమ్యాట్ ఖాతాను తెరిచాను. ఆ సమయంలో హర్సిల్ ఆగ్రో లిమిటెడ్ కంపెనీకి చెందిన 1312 షేర్లు ఒక్కొక్కటి రూ. 2 కోట్ల 14 లక్షల చొప్పున కనిపించాయి. దీనితో మొత్తం షేర్ల విలువ రూ.2817కోట్లకు పైగా ఉంది. ఆ కొద్ది సమయం పాటు దీపావళి తర్వాత లక్ష్మీదేవి కటాక్షం లభించిందని భావించాను" అని తెలిపారు.

నిజం తెలిసేసరికి నిరాశ
స్కూల్ నిర్వహణతో కూడా సంబంధం ఉన్న వినోద్ డోంగ్లే, ఆ డబ్బుతో పిల్లల ప్రయోజనం కోసం ఒక సంస్థను ఏర్పాటు చేయాలని, మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కూడా అనుకున్నారు. అయితే, కొద్దిసేపటికే ఈ మొత్తం విలువ సాధారణ స్థాయికి తిరిగి వచ్చింది. సాంకేతిక లోపం కారణంగానే ఇది జరిగిందని తర్వాత తెలిసింది. దీంతో వినోద్ డోంగ్లే కొద్దిసేపటి అపర కోటీశ్వరుడి కల కరిగిపోయింది.












Click it and Unblock the Notifications