ఇంట్లో బంగారంపై కేంద్రం కన్ను! ఇకపై గోల్డ్ షాపుల్లోనే దాచుకోవచ్చా?
భారతీయులకు బంగారంపై ఉన్న మక్కువ అంతా ఇంతా కాదు. పెళ్లిళ్లు, పండగలు, శుభకార్యాలు.. ఇలా సందర్భం ఏదైనా సరే, స్తోమతను బట్టి పసిడి కొని బీరువాలో దాచుకోవడం మనకు తరతరాలుగా వస్తున్న అలవాటు. అయితే, అలా ఇళ్లల్లో నిరుపయోగంగా పడి ఉన్న బంగారాన్ని దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఒక సరికొత్త వ్యూహాన్ని రచిస్తోంది. ప్రతిష్టాత్మకమైన 'గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్' (GMS)లో కీలక మార్పులు చేస్తూ, దేశంలోనే మొదటిసారిగా స్థానిక జ్యువెలర్లను (బంగారు వ్యాపారులను) ఈ పథకంలో భాగస్వాములుగా చేర్చాలని భావిస్తోంది. బ్యాంకులతో పోలిస్తే సామాన్య ప్రజలకు జ్యువెలర్లతోనే ఎక్కువ పరిచయం, నమ్మకం ఉంటాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు.
అయితే, ఈ పథకానికి కేవలం ప్రక్రియే అడ్డంకి కాదు, ప్రజల్లో ఉన్న 'ప్రభుత్వ పన్నుల భయమే' అసలైన సమస్య అని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. బంగారం డిపాజిట్ చేస్తే ఎక్కడ ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కన్ను పడుతుందో, తమ సంపాదనపై ఎక్కడ పన్ను ప్రశ్నలు అడుగుతుందో అనే ఆందోళనలు చాలా మందిలో ఉన్నాయి. దీనివల్ల ఈ రకమైన సంస్కరణలు కూడా ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వడం కష్టమేనని ఆర్థిక శాఖ వర్గాలు అంగీకరిస్తున్నాయి.

ఇళ్లల్లో కొండంత నిధి.. స్కీమ్లో గోరంతే!
గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ కింద ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసి, సురక్షితంగా వడ్డీని సంపాదించవచ్చు. కానీ, 2015 లో ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి నవంబర్ 2025 నాటికి కేవలం 39 టన్నుల బంగారం మాత్రమే మార్కెట్లోకి వచ్చింది. నిజానికి మన దేశంలోని ఇళ్లల్లో సుమారు 25,000 నుంచి 30,000 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. ఈ అపారమైన నిల్వలతో పోలిస్తే పథకం సాధించిన విజయం చాలా స్వల్పమని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో ఈ బంగారం డిపాజిట్ ప్రక్రియ చాలా క్లిష్టంగా ఉండేది. ప్రజలు తమ నగలను సేకరించే హాల్మార్కింగ్ కేంద్రాలకు తీసుకెళ్లి, వాటిని కరిగించి స్వచ్ఛతను పరీక్షించిన తర్వాతే బ్యాంకుల్లో ప్రత్యేక డిపాజిట్ ఖాతాలు తెరవాల్సి వచ్చేది. ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల చాలా తక్కువ డిపాజిట్లు రావడంతో, మార్చి 2025 లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలోని మధ్యకాలిక, దీర్ఘకాలిక డిపాజిట్లను నిలిపివేసింది. ప్రస్తుతం కేవలం స్వల్పకాలిక డిపాజిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.
ఈ క్రమంలోనే, చాలా మంది కస్టమర్లు తమ బంగారు లావాదేవీల కొరకు బ్యాంకుల కన్నా జ్యువెలర్ల వద్దకే తరచుగా వెళ్తుంటారని ప్రభుత్వం గుర్తించింది. స్థానిక గోల్డ్ షోరూమ్లకు ఈ డిపాజిట్లను సేకరించే అధికారం ఇవ్వడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పథకం మరింత వేగంగా దూసుకుపోతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.
రికార్డు స్థాయికి చేరిన బంగారం దిగుమతులు
ప్రపంచవ్యాప్తంగా అమెరికా లాంటి దేశాలు తమ కేంద్ర బ్యాంకుల్లో దాదాపు 8,100 టన్నుల అధికారిక బంగార నిల్వలను కలిగి ఉన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో కూడా పెద్ద ఎత్తున రిజర్వ్లు ఉన్నాయి. కానీ భారతదేశంలో మాత్రం ప్రభుత్వ నిల్వల కంటే ఎక్కువగా ప్రజల హస్తాల్లోనే బంగారం ఉంది. దేశీయంగా ఈ బంగారానికి ఉన్న తీవ్ర డిమాండ్ కారణంగా విదేశాల నుంచి భారీగా దిగుమతులు చేయాల్సి వస్తోందని నివేదికలు చెబుతున్నాయి.
మే 2026 నాటికి కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని (ఇంపోర్ట్ డ్యూటీ) ఏకంగా 15 శాతానికి పెంచినప్పటికీ దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కడా తగ్గలేదు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశ బంగారం దిగుమతులు ఏకంగా 72 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 58 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా, మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1.47 లక్షల వద్ద రికార్డు గరిష్ట స్థాయిలో కొనసాగుతోంది.
భరోసా ఇస్తేనే 'బంగారు' భవిష్యత్తు!
సౌకర్యవంతమైన కొత్త మార్పులు తీసుకురావడం ద్వారా నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని బయటకు తీసేందుకు జ్యువెలర్లను భాగస్వాములను చేయడం మంచి పరిణామమే. అయితే, కేవలం సదుపాయాలు పెంచితే సరిపోదు; ఐటీ తనిఖీల భయం నుంచి డిపాజిటర్లకు పూర్తి క్లీన్ చిట్ లేదా ఒక నిర్దిష్టమైన రక్షణ కల్పించే విధానాన్ని తీసుకురావాల్సి ఉంది. పన్నుల నిబంధనలపై ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కల్పించి, పారదర్శకమైన విధానాన్ని అమలు చేసినప్పుడే ఇళ్లల్లోని బంగారం దేశ ఆర్థిక ప్రగతికి నిజమైన చోదక శక్తిగా మారగలదు.














Click it and Unblock the Notifications