కొత్త సంవత్సరం.. తొలి ట్రేడింగ్.. మదుపరులను నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు!
ముంబై: కొత్త ఏడాది.. తొలిరోజున.. దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ప్రధానంగా ఆరంభం నుంచీ ఫ్లాట్గా ట్రేడవుతున్నప్పటికీ చివరి సెషన్లో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో కీలక సూచీలు నష్టాలను చవి చూశాయి.
బ్యాంక్ నిప్టీ కూడా 200 పాయింట్లకు పైగా నష్టపోయింది. మరోవైపు ప్రపంచ మార్కెట్లన్నీ సెలవుల్లో ఉండటంతో దేశీయంగా ట్రేడర్లు అప్రమత్తంగా ఉన్నట్టు విశ్లేషకులు పేర్కొన్నారు.
అంబానీ సోదరుల డీల్ నేపథ్యంలో...
కొత్త ఏడాది 20018 తొలిరోజైన సోమవారం.. సెన్సెక్స్ 244 పాయింట్లు పతనమై 33,812 వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 10,435 వద్ద స్థిరపడ్డాయి. అనిల్ అంబానీ, ముకేశ్ అంబానీ డీల్ నేపథ్యంలో అడాగ్ గ్రూప్ షేర్ల హవా సాగింది. అటు టెక్ దిగ్గజం టీసీఎస్ టాప్ లూజర్గా నిలవగా, ఇండియా బుల్స్ హౌసింగ్, కోల్ ఇండియా టాప్ విన్నర్స్గా నిలిచాయి.
ఇవి లాభాల్లో... అవి నష్టాల్లో...
అలాగే రిలయన్స్ నావల్, రిలయన్స్ పవర్ భారీ లాభాల్లోనూ, అదానీ పవర్, ఇన్ఫీబీమ్, రిలయన్స్ ఇన్ఫ్రా, టాటా పవర్, రిలయన్స్ కేపిటల్, హెచ్సీసీ, సుజ్లాన్, జీఎంఆర్ ఇన్ఫ్రా స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఐడియా, ఇన్ఫ్రాటెల్, బీపీసీఎల్, ఐఆర్బీ, శ్రీసిమెంట్, బాష్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్, హెచ్యూఎల్ నష్టపోయాయి.
ఆరంభం నుంచీ ఫ్లాట్గా...
గతేడాది ముగింపులో సరికొత్త రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు, కొత్త ఏడాదిలో ఫ్లాట్గా ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 12 పాయింట్ల నష్టంలో 34,044 వద్ద ఉండగా.. నిఫ్టీ 9 పాయింట్ల నష్టంలో 10,521 వద్ద కొనసాగింది. ఎన్ఎస్ఈలో రియల్టీ 1.2 శాతం జంప్చేయగా, పీఎస్యూ బ్యాంక్స్ 0.7 శాతం స్థాయిలో పుంజుకుంది.
నీరసించిన ఐటీ, బ్యాంకులు...
ఐటీ రంగం మాత్రం 0.4 శాతం నీరసించింది.స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఎల్ అండ్ టీ, హీరో మోటోకార్ప్, గెయిల్లు ప్రారంభ ట్రేడింగ్లో టాప్ గెయినర్లుగా ఉండగా.. హెచ్యూఎల్, విప్రో, ఇన్ఫోసిస్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. కొత్త ఏడాదిలో డాలర్తో రూపాయి మారకం విలువ బలపడి 63.84గా ప్రారంభమైంది.
పీఎంఐ గణాంకాల ప్రభావం...
స్టాక్ మార్కెట్పై కొత్త ఏడాది తొలి వారంలో తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ప్రభావం చూపుతాయని విశ్లేషకులంటున్నారు. డాలర్తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి, ప్రపంచ మార్కెట్ల పోకడ, వీటితో పాటు పార్లమెంట్ శీతాకాల సమావేశాల పరిణామాల ప్రభావం కూడా స్టాక్ మార్కెట్పై ఉంటుందని వారంటున్నారు. అంతేకాకుండా, కంపెనీల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలను కూడా మదుపుదారులు గమనిస్తారని నిపుణులంటున్నారు.