దేశ ప్రజలకు విజ్ఞప్తి! పెట్రోల్, డీజిల్ పై కేంద్రం కీలక ప్రకటన
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసులో అనిశ్చితి నెలకొన్నప్పటికీ, భారత్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ (LPG) కొరత లేదని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ధరల అస్థిరత ఉన్నప్పటికీ, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వల్ల దేశీయంగా సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని సోమవారం ఒక ప్రకటనలో హామీ ఇచ్చింది.
దేశవ్యాప్తంగా ఇంధన పరిస్థితిపై జరిగిన అంతర-మంత్రిత్వ సమావేశంలో సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వెల్లడించారు.

నిల్వలు పుష్కలం.. రిఫైనరీలు సిద్ధం!
దేశంలో ముడి చమురు నిల్వలు స్థిరంగా ఉన్నాయని, మన రిఫైనరీలు వాటి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. "దేశవ్యాప్తంగా ఏ ఒక్క రిటైల్ అవుట్లెట్ (పెట్రోల్ బంక్) లోనూ నిల్వలు ఖాళీ కాలేదు. గృహ వంట అవసరాలకు తగినంత ఎల్పీజీ నిల్వలు ఉన్నాయి" అని సుజాత శర్మ స్పష్టం చేశారు. గత మూడు రోజుల్లోనే రికార్డు స్థాయిలో 1.26 కోట్ల ఎల్పీజీ సిలిండర్లను గృహాలకు పంపిణీ చేసినట్లు ఆమె గణాంకాలతో వివరించారు.
ప్రధాని పిలుపు: 'ఏడు విజ్ఞప్తులు' పాటించండి
దేశంపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రజలందరూ ఇంధన పొదుపు చర్యలు పాటించాలని ప్రభుత్వం కోరింది. ఆదివారం సికింద్రాబాద్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ఏడు కీలక విజ్ఞప్తులను ఈ సందర్భంగా మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించి, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని కోరారు.
ప్రధాని సూచించిన పొదుపు మంత్రాలు:
- ప్రజా రవాణా: సాధ్యమైనంత వరకు వ్యక్తిగత వాహనాలకు బదులు మెట్రో, బస్సు వంటి ప్రజా రవాణాను వాడాలి.
- కార్ పూలింగ్: ఆఫీసులకు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు కార్పూలింగ్ పద్ధతిని ఎంచుకోవాలి.
- ఎలక్ట్రిక్ వాహనాలు: పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల (EV) వాడకాన్ని పెంచాలి.
- రైల్వే రవాణా: వస్తువుల రవాణా కోసం రోడ్డు మార్గం కంటే రైల్వేలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
- ఇంటి నుంచే పని: సాధ్యమైన చోట వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) విధానాన్ని పాటించి ప్రయాణాలను తగ్గించుకోవాలి.
దిగుమతుల భారం తగ్గించుకుందాం!
కేవలం ఇంధనమే కాకుండా, వంట నూనెలు, రసాయన ఎరువుల దిగుమతుల కోసం దేశం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని వెచ్చిస్తోందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపడం ద్వారా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, తద్వారా విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని ప్రధాని సూచించారు. అలాగే, రాబోయే ఏడాది కాలం పాటు విదేశీ ప్రయాణాలను తగ్గించుకుని, స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలని పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఆర్థిక సవాళ్లను అధిగమించడానికి ప్రతి పౌరుడు తన రోజువారీ జీవితంలో శక్తిని ఆదా చేయడానికి ప్రయత్నించాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ కోరింది.














Click it and Unblock the Notifications