దేనా బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు: కొత్త అప్పులు, నియామకాలొద్దు
న్యూఢిల్లీ: దేనా బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది.మొండి బకాయిలతో దేనా బ్యాంకు ఇబ్బందులు పడుతోంది. మళ్ళీ ఆదేశాలిచ్చే వరకు కొత్త రుణాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అంతేకాకుండా కొత్తగా ఉద్యోగ నియామకాలను కూడ చేపట్టకూడదని ఆర్బీఐ సూచించింది.
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసికం ఫలితాలను దేనా బ్యాంకు శుక్రవారం వెల్లడించింది. మార్చితో ముగిసిన ఈ త్రైమాసికంలో బ్యాంకు రూ. 1,225.42కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. 2016-17 ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు నికరలాభం రూ. 575.26కోట్లు ఉండగా.. ఇప్పుడది రెండు రెట్లు పెరిగింది. మొండి బకాయిల వల్లే నష్టాలు పెరిగినట్లు బ్యాంకు పేర్కొంది.
దీంతో ఆర్బీఐ రంగంలోకి దిగింది. సత్వర చర్యల్లో భాగంగా బ్యాంకుపై ఆర్బీఐ కొన్ని ఆంక్షలు విధించింది. నికర నిరర్ధక ఆస్తులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బ్యాంకు ఎలాంటి కొత్త రుణాలు ఇవ్వకుండా నిబంధనలు విధించింది. అంతేగాక కొత్తగా సిబ్బందిని కూడా నియమించుకోకూదని ఆదేశించిందని బ్యాంకు తెలిపింది.
మార్చి త్రైమాసికంలో బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 22.4శాతం పెరిగి రూ. 16,361.44కోట్లుగా ఉన్నాయి. ఇక నికర నిరర్ధక ఆస్తులు కూడా 11.95శాతం పెరిగి రూ. 7,838.78కోట్లుగా ఉన్నాయని దేనా బ్యాంకు ప్రకటించింది.