రక్తపు మడుగులో రూపాయి, డాలర్ ఊచకోతకి రాత్రికి రాత్రే...
భారత ఆర్థిక రంగానికి బ్లాక్ మండే ఎదురైంది. దేశీయ కరెన్సీ రూపాయి విలువ అంతకంతకూ క్షీణిస్తూ పాతాళానికి పడిపోతోంది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా సోమవారం (మే 18, 2026) నాటి ట్రేడింగ్లో రూపాయి ఏకంగా 21 పైసలు క్షీణించి, చరిత్రలోనే అత్యంత కనిష్ట స్థాయి అయిన 96.17 వద్దకు చేరింది. గత శుక్రవారం నాడే తొలిసారిగా రూపాయి 96 మార్కును దాటి షాక్ ఇవ్వగా, తాజాగా ఆ పతనం మరింత తీవ్రరూపం దాల్చి ఇన్వెస్టర్లలో వణుకు పుట్టిస్తోంది.
రూపాయి ఈ స్థాయి లో కొట్టుకుపోవడానికి పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. యూఏఈ (UAE) అణు విద్యుత్ కేంద్రంపై జరిగిన దాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి తోడు అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరగాల్సిన శాంతి చర్చలకు ఆటంకాలు ఏర్పడటంతో ముడి చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో రాత్రికిరాత్రే బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక శాతానికి పైగా పెరిగి బ్యారెల్కు ఏకంగా 111 డాలర్లకు చేరుకున్నాయి. చమురు ధరలు నిరంతరం పెరగడం, అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలోపేతం కావడం భారత కరెన్సీని కోలుకోలేని దెబ్బతీశాయి.

ట్రంప్-జిన్పింగ్ చర్చలు విఫలం.. బలపడిన డాలర్
మరోవైపు అమెరికా ఆర్థిక గణాంకాలు పటిష్టంగా ఉండటంతో గ్లోబల్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ మరింత పుంజుకుంది. ఇదే సమయంలో ప్రపంచ దేశాలు ఎంతో ఆశగా ఎదురుచూసిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ - చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ల అత్యున్నత స్థాయి సమావేశంలో ఎలాంటి పురోగతి లభించకపోవడం కూడా అంతర్జాతీయ సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో సురక్షిత ఆస్తిగా భావించే డాలర్ వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో రూపాయిపై ఒత్తిడి పతాక స్థాయికి చేరింది.
కరెంట్ ఖాతా లోటు భయం.. ఇక ఆర్బీఐ చేతుల్లోనే!
భారతదేశం తన ముడి చమురు అవసరాల కోసం అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఇప్పుడు చమురు ధరలు 110 డాలర్ల పైనే కదలాడుతుండటం, విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు (FPI) భారత మార్కెట్ల నుండి తమ నిధులను భారీగా వెనక్కి తీసేసుకుంటుండటంతో దేశ దిగుమతి బిల్లు భారీగా పెరిగిపోతోంది. ఇది దేశ కరెంట్ ఖాతా లోటును (CAD) మరింత విస్తృతం చేస్తోంది.
ఈ సంక్షోభంపై 'ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్' విశ్లేషకులు స్పందిస్తూ భయాందోళన వ్యక్తం చేశారు. "పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గి, ప్రపంచ రవాణాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధి తిరిగి పూర్తిస్థాయిలో తెరుచుకుంటేనే డాలర్/రూపాయి డిమాండ్ తగ్గుతుంది. అలా జరగని పక్షంలో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తక్షణమే స్పందించి దేశంలోకి డాలర్ ప్రవాహాన్ని పెంచే ప్రత్యేక పధకాలను ప్రకటించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్బీఐ గనుక దూకుడుగా రంగంలోకి దిగకపోతే.. రూపాయి విలువ అతి త్వరలోనే 100/డాలర్ మార్కును తాకడం ఖాయం" అని హెచ్చరిస్తున్నారు














Click it and Unblock the Notifications