చందాకొచ్చర్, శిఖలకు శ్రీముఖాలతో తంటా: ఆఖర్లో రూ.1.54 లక్షల కోట్లు హాంఫట్!
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లో రుణ కుంభకోణం తాజా ప్రకంపనల ధాటికి మంగళవారం స్టాక్ మార్కెట్ కుదేలైంది. అయిదో రోజూ సాధారణ మదుపర్లకు ఏడుపే మిగిలింది. వరుస నష్టాల నుంచి పుంజుకుంటుందేమోనని భావించిన మార్కెట్ మళ్లీ నిరాశపరచింది. ఆరంభంలో మంచి దూకుడు మీద కనిపించి.. ఈసారి పెరుగుతున్నట్లే అనిపించింది. మరో ఐదు బ్యాంక్లను పీసీఏ పరిధిలోకి ఆర్బీఐ తేనున్నదన్న వార్తలతో బ్యాంకింగ్ రంగ స్థితిగతులు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేశాయి.
చివరి గంటన్నర ట్రేడింగ్ మదుపర్లు పొందిన ఆనందాన్ని ఒక్కసారిగా ఎగరేసుకుపోయింది. భారతీయ మార్కెట్లు ప్రత్యేకించి వ్యక్తిగత మదుపర్లు భారీగా రూ. 1.54 లక్షల కోట్ల మేరకు నష్ట పోయారు.అంతకు ముందు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై ట్రంప్ సుంకాల విధింపుకు వ్యతిరేకత ప్రబలంగా ఉండటంతో వాణిజ్య యుద్ధాలపై ఆందోళన తగ్గి ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి.

31 బ్యాంకుల సీనియర్ ఎగ్జిక్యూటివ్లకూ తప్పని విచారణ
పీఎన్బీ కుంభకోణం 2010 నుంచే జరుగుతోందని వెల్లడి కావడం, దీనిపై ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ చందాకొచ్చర్, యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మలకు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐఓ) నోటీసులు అందడం కూడా ప్రతికూల ప్రభావం చూపాయి. కానీ మోదీ, చోక్సీలతో వ్యాపార లావాదేవీలు నిర్వహించిన 31 బ్యాంక్లకు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్లను ఎస్ఎఫ్ఐఓ విచారించనున్నదని వార్తలు వచ్చాయి.

డిసెంబర్ 14 తర్వాత సెన్సెక్స్ పతనం ఇదే తొలిసారి
బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 33,350 పాయింట్ల దిగువకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 10,250 పాయింట్ల దిగువకు పడిపోయాయి. వరుసగా ఐదో రోజూ ప్రధాన స్టాక్ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 430 పాయింట్లు నష్టపోయి 33,317 పాయింట్ల వద్ద, నిఫ్టీ 110 పాయింట్లు పతనమై 10,249 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు దాదాపు మూడు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. గత ఏడాది డిసెంబర్ 14 తర్వాత సెన్సెక్స్కు ఇదే కనిష్ట స్థాయి. గత నెల ఆరో తేదీ తర్వాత సెన్సెక్స్ అత్యధిక పాయింట్లు నష్టపోవడం కూడా ఇదే తొలిసారి. కాగా సెన్సెక్స్కు ఈ ఏడాది ఇదే కనిష్ట స్థాయి.

వెంటాడిన ద్రవ్యలోటు భయాలు
ఉక్కు, అల్యూమినియమ్ దిగుమతి సుంకాలపై నిరసన తీవ్రం కావడంతో సుంకాల విషయమై అమెరికా పునరాలోచన చేసే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో వాణిజ్య యుద్ధాల ఆందోళన తగ్గింది. దీంతో ప్రపంచ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈ దన్నుతో సెన్సెక్స్ ఉదయం 34,047 పాయింట్ల వద్ద భారీ లాభాల్లోనే ఆరంభమైంది. కొనుగోళ్లు జోరుగా సాగడంతో ఇంట్రాడేలో 313 పాయింట్ల లాభంతో 34,060 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. కాగా, భారత రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులు క్షీణిస్తున్నాయని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ తాజా నివేదిక వెల్లడించడం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు వరుసగా ఐదో రోజూ పెరగడం ప్రతికూల ప్రభావం చూపాయి.

వృద్ధిరేటు పెరుగుదలతో ఫండమెంటల్స్ పురోగతి
స్టాక్ మార్కెట్లలో చాలా షేర్లు ఫండమెంటల్స్తో పోల్చుకుంటే అధిక విలువతో ట్రేడవుతున్నాయి. దీంతో అవి వాటి ఫండమెంటల్స్ను చేరుకునే క్రమంలో కొంత విలువను కోల్పోతున్నాయి. జీడీపీ వృద్ధిరేటు పెరిగితే ఫండమెంటల్స్కూడా అభివృద్ధి చెంది అధిక విలువను పొందే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. క్రమంగా కుంగుతున్న ఆర్థిక వ్యవస్థ దేశానికి ముప్పుగా మారుతుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ హెచ్చరించింది. ఇప్పటికే ప్రపంచంలో రెండో అతిపెద్ద ద్రవ్యలోటు భారత్దే అని పేర్కొంది. ఈ నివేదిక భారత స్టాక్ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

బ్యాంకులను వెంటాడుతున్న మొండి బకాయిల సమస్య
వాణిజ్య యుద్ధాల భయాలు తగ్గడంతో ఆసియా మార్కెట్లు లాభపడ్డాయి. జపాన్ నికాయ్, చైనా షాంగై కాంపొజిట్, హాంగ్కాంగ్ హాంగ్సెంగ్, దక్షిణ కొరియా కోస్పీ సూచీలు 1-2% రేంజ్లో పెరిగాయి. అంతర్జాతీయంగా ఆశావహ పరిస్థితులున్నా మన మార్కెట్ నష్టపోయిందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. మొండి బకాయిల సమస్య, బాండ్ల రాబడులు పెరుగుతుండడం, నిధులపై అధిక వడ్డీ వ్యయాలు ప్రభావం చూపాయని వివరించారు.

ఇలా ఐదు రోజుల్లో రూ. 4.30 లక్షల కోట్లు ఆవిరి
సమీప భవిష్యత్తులో మార్కెట్లో ఒడిదొడుకులు కొనసాగుతాయని రెలిగేర్ బ్రోకింగ్ ప్రెసిడెంట్ జయంత్ మాంగ్లిక్ అంచనా వేస్తున్నారు. ఐదు రోజుల స్టాక్ మార్కెట్ నష్టాలతో రూ.4.30 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,129 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ ఐదు ట్రేడింగ్ సెషన్లలో రూ.4,30,043 కోట్లు ఆవిరై రూ.1,44,20,606 కోట్లకు పడిపోయింది. ఒక్క మంగళవారం రోజే రూ. 1.54 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

అమెరికా వస్తువులపై 25 శాతం సుంకం విధిస్తామని ఈయూ హెచ్చరిక
స్టీల్ దిగుమతులపై పన్ను విధిస్తానని ట్రంప్ పేర్కొనడంతో వాణిజ్య యుద్ధానికి తెరలేచింది. దీనికి యూరోపియన్ యూనియన్ దీటుగా స్పందించింది. తాము కూడా అమెరికా వస్తువులపై భారీగా పన్నులు విధిస్తామని.. అది యూఎస్ను తీవ్రంగా ఇబ్బంది పెడుతుందని పేర్కొంది. ఈ విషయాన్ని ఈయూ పార్లమెంట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిటీ అధ్యక్షుడు పేర్కొన్నారు. దీంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే 3.5 బిలియన్ డాలర్ల వస్తువులపై 25శాతం పన్ను విధించే అవకాశం ఉంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications