ఐదేళ్లలో కోటి కొలువులు.. ఇదీ టెలికం నైపుణ్యమండలి లెక్క!!
న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలను టెలికం రంగం సృష్టిస్తుందని ఆ రంగ నైపుణ్య మండలి (టీఎస్ఎస్సీ) చెబుతున్నది. రిలయన్స్ జియో రాకతో దేశీయ టెలికం రంగ ముఖచిత్రం పూర్తిగా మారిపోయిన సంగతి తెలిసిందే. ఒకవైపు 'రిలయన్స్ జియో' తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీ ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ వంటి దిగ్గజాల లాభాలు ఆవిరయ్యాయి.
మరోవైపు ధరల యుద్ధంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా టెలీ, ఎయిర్సెల్ వంటి సంస్థలు వ్యాపారాల్నే మూసేసుకుంటున్నాయి.ఇంకోపక్క పెద్ద ఎత్తున విలీనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టెలికం రంగంలో 40 లక్షల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో ఈ సంఖ్య 1. 43 కోట్లకు చేరనున్నది.

మౌలిక, సేవల రంగంలో మున్ముందు అవకాశాలు పుష్కలం
టెలికం, టెలికం తయారీ విభాగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయని టెలికం రంగ నైపుణ్య మండలి సీఈవో ఎస్పీ కొచ్చర్ పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. మెషీన్ టు మెషీన్ కమ్యూనికేషన్స్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు, టెలికం తయారీ, మౌలిక, సేవల కంపెనీల నుంచి మున్ముందు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని టెలికం రంగ నైపుణ్య మండలి (టీఎస్ఎస్సీ) అంచనా వేస్తున్నది.

టెలికం రంగంలో రేకెత్తిస్తున్న కొంగొత్త ఆశలు
‘దేశంలో ఉత్పాదక రంగం బలపడుతుండటాన్ని మేము చూస్తున్నాం. ఈ సంకేతాలు టెలికం రంగంలో కొత్త ఆశల్ని రేకెత్తిస్తున్నాయి. టెలికం తయారీ పరిశ్రమ సామర్థ్యం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే వచ్చే ఐదేళ్లలో కోటికిపైగా ఉద్యోగాలు పుట్టుకువస్తాయని అంచనా' అని టీఎస్ఎస్సీ సీఈఓ కొచ్చర్ అన్నారు. జాతీయ వృత్తి ప్రమాణాల ఆధారంగా శిక్షణ విధానాలను రూపొందించే దిశగా టీఎస్ఎస్సీ వెళ్తున్నది.

టవర్ కంపెనీలు శిక్షణా కేంద్రంలో భాగస్వాములు కావాలి
నైపుణ్యం పెరిగితే ఉద్యోగావకాశాలు మెరుగుపడుతాయని టెలికం రంగ నైపుణ్య మండలి (టీఎస్ఎస్సీ) చెబుతున్నది. ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, టవర్ కంపెనీలు ఈ శిక్షణ కేంద్రంలో భాగస్వాములు కావాలన్న ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయని టీఎస్ఎస్సీ సీఈఓ కొచ్చర్ చెప్పారు. అన్ని టవర్ టెక్నీషియన్లకు ఇక్కడ శిక్షణ ఇస్తామని తెలిపారు.

టీఎస్ఎస్సీ ఆధ్వర్యంలోనూ ఇన్వెస్ట్మెంట్స్
అప్పుడు వారికి సులభంగా ఉద్యోగాలు లభించగలవని టెలికం రంగ నైపుణ్య మండలి (టీఎస్ఎస్సీ) సీఈఓ కొచ్చర్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ట్రైనింగ్ సెంటర్ కోసం టీఎస్ఎస్సీ కొంతమేర పెట్టుబడులు పెట్టనున్నదని, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా మరికొన్ని పెట్టుబడులు కార్పొరేట్ సంస్థల నుంచి వస్తాయని టీఎస్ఎస్సీ సీఈఓ కొచ్చర్ అన్నారు.

టెలికం రంగంలో ఏడాదిలో 40 వేల ఉద్యోగాలు హుష్ కాకి!
సీఐఈఎల్ హెచ్ఆర్ నివేదిక ప్రకారం ప్రస్తుతం సంక్షోభంలో చిక్కుకున్న దేశీయ టెలికం పరిశ్రమలో గడిచిన ఏడాది కాలంగా దాదాపు 40 వేల మంది ఉద్యోగాలు పోయాయి. మరో ఆరు నుంచి తొమ్మిది నెలల్లో మరిన్ని ఉద్యోగాలు పోతాయన్న అంచనాలు ఉన్నాయి. ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య 80 నుంచి 90 వేలకు చేరుకుంటుందని భావిస్తున్నారు.

ఐడియా - వొడాఫోన్ విలీనం.. ఎయిర్ టెల్లో టెలీనార్, టాటా టెలీ
టెలికం రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో బడా సంస్థలన్నీ ఏకమవుతున్న సంగతి తెలిసిందే. ఐడియా, వొడాఫోన్ సంస్థలు విలీనం కాగా, ఎయిర్టెల్లో టెలీనార్, టాటా టెలీ కలిసిపోతున్న సంగతీ విదితమే. ఎయిర్సెల్, రిలయన్స్ కమ్యూనికేషన్స్ కూడా మూతబడుతుండటంతో ఉద్యోగులపై వేటు తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

జియో, ఎయిర్ టెల్ మధ్య ధరల యుద్దానికి బీజం
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ‘రిలయన్స్ జియో ఇన్ఫోకామ్' రాకతో టెలికం కంపెనీల ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా తారుమారయ్యాయి. ఏడాదికిపైగా జియో ఉచిత సేవలను అందించడంతో ఆయా టెలికం సంస్థల లాభాలు ఆవిరయ్యాయి. కస్టమర్లూ తగ్గిపోయారు. ఆ తర్వాతి కాలంలోనూ జియో టారీఫ్లను భారీగా తగ్గించగా, ఎయిర్టెల్, జియో మధ్య ధరల యుద్ధానికి బీజం పడింది.

తగ్గిన ఎయిర్టెల్ లాభాలు.. నష్టాల్లో ఐడియా
దీంతో అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్, టాటా గ్రూప్నకు చెందిన టాటా టెలీ, ఎయిర్సెల్ తదితర కంపెనీల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. వ్యాపారం లేక ఆదాయం పడిపోగా, పీకల్లోతు అప్పుల్లో కూరుకున్నాయి. ఎయిర్టెల్ లాభాలు దిగజారగా, ఐడియా ఏకంగా నష్టాల్నే ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications