పేరుకే కేటాయింపుల బోగం: ‘రక్షణ’లో ఆధునీకరణకు తగ్గుతున్న నిధులు

న్యూఢిల్లీ: సైనిక సిబ్బందిలో ప్రపంచంలోకెల్లా భారతదేశానికి రెండోస్థానం. బడ్జెట్ కేటాయింపుల్లో ఆరోస్థానం. కానీ ఆయుధాల సమీకరణ, సైనిక బలగాల ఆధునీకరణ స్థాయికి అనుగుణంగా జవాన్ల నియామకం జరుగడం లేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. పేరుకు రక్షణ శాఖలో ఆధునీకరణ దూసుకెళ్తున్నా.. బడ్జెట్ కేటాయింపులతోపాటు కేంద్ర ప్రభుత్వ కేటాయింపులు కూడా తగ్గుముఖం పట్టాయంటే అతిశయోక్తి కాదు.

ఆధునీకరణకు చేసిన ఖర్చు కూడా 2015- 16తో పోలిస్తే 2016 - 17లో తగ్గుముఖం పట్టింది. 2015 - 16లో ఆధునీకరణకు రూ.70, 414 కోట్లు ఖర్చు చేస్తే, గతేడాది 0.9 శాతం తగ్గి రూ.69,783 కోట్లకు పడిపోయింది. కేవలం వైమానిక దళ ఆధునీకరణ ప్రక్రియే 12.1 శాతం పెరిగింది. ఆర్మీ ఆధునీకరణ 6.4 శాతానికి పరిమితం కాగా, నేవీ ఆధునీకరణ 12.1 శాతంతో సరిపెట్టుకున్నది.

ఒకప్పుడు ఆయుధం కన్నా ఆహారం మిన్న అన్నది నినాదం. కానీ దానికి ఇప్పుడు కాలం చెల్లింది. మనం శాంతి మంత్రం జపిస్తూనే ఉన్నా పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ మన భూభాగాలపై కన్నేసి.. మన ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి.

భారత్‌ కనుక సైనిక సంపత్తిని త్వరితగతిన ఆధునికీకరణ చేసుకోకపోతే భవిష్యత్‌లో భారీగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ప్రస్తుత కేటాయింపులతో పోలిస్తే రక్షణ రంగ ఆధునీకరణకు మరో 12 శాతం (రూ.8,590 కోట్లు) ఖర్చు చేయాల్సి అవసరం ఉన్నది. నూతన పథకాల క్రితం వైమానిక దళ ఆధునీకరణకు 17 శాతం (రూ.4,685 కోట్లు) కేటాయించగా, మొత్తం రక్షణశాఖకు రూ.27,556 కోట్లు కేటాయించారు.

 చైనా ప్లస్ పాకిస్థాన్ రెండు శాతం కంటే ఎక్కువ

చైనా ప్లస్ పాకిస్థాన్ రెండు శాతం కంటే ఎక్కువ

అయితే భారత రక్షణ వ్యయంలో చాలా వరకు నిర్వహణ, జీత భత్యాలకే కేటాయిస్తున్నారు. దీంతో అత్యాధునిక ఆయుధ సామగ్రి కొనుగోలుకు నిధుల కొరత ఎదురవుతోంది. 2007లో రక్షణ రంగ బడ్జెట్‌లో మూలధన వ్యయానికి 41 శాతం ఖర్చు చేశారు. 2016-17 నాటికి ఇది 30 శాతానికి పడిపోయింది. పెరిగిన జీతభత్యాల వ్యయమే దీనికి కారణం. భారత్‌ చాలా రక్షణ ఒప్పందాలకు వాయిదాల పద్దతిలోనే నిధులను చెల్లిస్తోంది. దీంతో రక్షణ రంగ కేటాయింపుల్లో సింహభాగాన్ని ఈ వాయిదాలకే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. పొరుగు దేశాలతో పోల్చుకుంటే జీడీపీలో రక్షణకు మనం కేటాయించేది 1.6 శాతమే. అదే పాకిస్థాన్‌ 2.36 శాతం.. చైనా 2.1 శాతం కేటాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ కేటాయింపులను పెంచాల్సిన అవసరం ఉంది. కానీ దీనికి భిన్నంగా రాన్రానూ ప్రభుత్వ వ్యయంలో రక్షణ శాఖకు కేటాయించే పెరుగుదల శాతం తగ్గిపోతోంది. 2016-17లో ప్రభుత్వం రూ.2,49,099 కోట్లను రక్షణశాఖకు కేటాయించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 9.95శాతం ఎక్కువ. కేంద్రప్రభుత్వ మూల వ్యయంలో 17.24శాతానికి సమానం. 2017-18లో ప్రభుత్వం రక్షణశాఖకు రూ.2,62,389 కోట్లను కేటాయించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చుకుంటే ఇది 5.55శాతం మాత్రమే ఎక్కువ. ప్రభుత్వ మూల వ్యయంలో 16.76 శాతానికి సమానం. వచ్చే బడ్జెట్‌లో ప్రభుత్వం ఇలా కాకుండా కేటాయింపులు పెంచుతుందని రక్షణ రంగ నిపుణులు ఆశిస్తున్నారు.

 కాలం చెల్లిన ఆయుధాలు పక్కనబెట్టాలి

కాలం చెల్లిన ఆయుధాలు పక్కనబెట్టాలి

వాయిదాల చెల్లింపులు వేగవంతం చేయడానికి, త్రివిధ దళాలకు ఆయుధ సంపత్తి కోసం కొత్త ఒప్పందాలు చేసుకొనే సమయంలో అడ్వాన్స్‌లు చెల్లించేందుకు వీలుగా నిధులను కేటాయించాలి. లేకపోతే నూతన సాంకేతిక పరిజ్ఞానం చాలా ఆలస్యంగా సైన్యం చేతికి అందుతుంది. వాయుసేనలో మొత్తం 32 స్క్వాడ్రన్‌లు ఉన్నాయి. వీటిలో సోవియట్‌ నాటి కాలం చెల్లిన మిగ్‌-21, 27లను పక్కన పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వైమానిక దళంలోని సగానికి పైగా మిగ్‌-21లు ప్రమాదాలకు గురయ్యాయంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఐఏఎఫ్‌లోని మూడు మిగ్‌-21 స్క్వాడ్రన్‌లు 2020నాటికి వైదొలగాలి. ఇదే కాలంలో రెండు జాగ్వార్‌ స్క్వాడ్రన్‌లూ తప్పుకోవాలి. వీటి స్థానంలో రెండు సు-30 స్క్వాడ్రన్‌లు బాధ్యతలు చేపట్టాలి. దీంతోపాటు మరో రెండు రాఫెల్‌ స్క్వాడ్రన్‌లను, ఆరు తేజస్‌ స్క్వాడ్రన్‌లను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే 2024 నాటికి వైమానిక దళం నుంచి 12 స్క్వాడ్రన్‌లు వైదొలగుతాయి. వీటి స్థానంలో కొత్తగా 10 మాత్రమే వచ్చి చేరుతున్నాయి. అదీ 2025 నాటికి! ఇక 2032 నాటికి 42 స్క్వాడ్రన్లను సిద్ధం చేయాలనే లక్ష్యాన్ని ఈ కేటాయింపుల వేగంతో అందుకోవడం కష్టం. అధిక కేటాయింపులు జరగకుంటే ఐదోతరం స్టెల్త్ జెట్‌లు భారత అమ్ములపొదిలో చేరడం కలగానే మిగిలిపోతుంది. చిన్నచిన్న దేశాలు కూడా ఎఫ్‌-16, ఎఫ్‌35, గ్రిపెన్‌, యూరోజెట్‌ విమానాలను వినియోగిస్తున్నాయి. భారత్‌ కూడా ఎఫ్‌-16, గ్రిపెన్‌లలో ఒక దానిని ఎంచుకోవాలని చూస్తోంది. దీంతో లాక్‌హీడ్‌ మార్టిన్‌ టాటాలతో జతకట్టగా.. స్వీడన్‌కు చెందిన గ్రిపెన్‌ అదానీ గ్రూప్‌తో కలిసింది. ఒప్పందం ఓకే చేసి నిధులు మంజూరు చేయడమే తరువాయి అని రక్షణ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. డి.బి.షెకాట్కార్‌ కమిటీ సూచించిన విధంగా తగిన పరిమాణంలో బలగాలు.. సమతూకంలో రక్షణ వ్యయం అనే అంశాన్ని ఈ సారి బడ్జెట్‌ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. రక్షణ రంగంలో మరిన్ని పరిశోధన అభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనివల్ల దేశీయంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. దీనివల్ల భారత్‌లో తయారీ విధానం బలపడి విదేశీ మారక ద్రవ్యం మిగిలే అవకాశం ఉంది. రక్షణ బలగాల ఆయుధాల్లో దేశీయంగా తయారు చేసేవి 40 శాతం వరకు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో వీటిని 70శాతానికి చేర్చాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా రక్షణ రంగంలోకి మరిన్ని ప్రైవేటు సంస్థలను అనుమతించే విషయంపై ప్రభుత్వం ఓ ప్రకటన చేయొచ్చు.

 రక్షణ కొనుగోళ్లకు డెలివరీ ఆలస్యం.. అగ్రిమెంట్లలో జాప్యం

రక్షణ కొనుగోళ్లకు డెలివరీ ఆలస్యం.. అగ్రిమెంట్లలో జాప్యం

భారత రక్షణ రంగానికి కేటాయించిన నిధులను వినియోగించుకోవడం కూడా రాదనే విమర్శలున్నాయి. ఏ శాఖలో లేని విధంగా రక్షణ రంగ బడ్జెట్‌ మిగిలితే దాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పజెప్పాలి. రక్షణ రంగానికి కేటాయించిన నిధులకు కాలపరిమితి లేకుండా ఉండే అవకాశాన్ని చట్టపరంగా ఇవ్వలేదు. దీంతో కొన్నేళ్లుగా ఏటా కనీసం రూ.7,000 కోట్ల వరకు సరెండర్‌ చేస్తున్నారు. వీటిని తర్వాతి సంవత్సరానికి తీసుకువెళ్లే అవకాశం లేదు. ఈ మొత్తాన్ని కీలక సమయాల్లో దళాలకు వినియోగించలేకపోవడం వల్ల కొన్ని సార్లు నిధుల కొరత ఏర్పడుతోంది. చాలా సమయాల్లో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన డెలివరీలు ఆలస్యం కావడం, అగ్రిమెంట్లలో జాప్యం కారణంగా నిధులు మిగిలిపోతుంటాయి. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేయడం.. వివిధ దశల్లో నిర్ణయాలను వేగంగా తీసుకోవడం అవసరం. సాధారణ బడ్జెట్‌ కేటాయింపులతో ఇప్పటికే చెల్లించాల్సిన మొత్తాలు, కొత్త ఆయుధాల కొనుగోళ్లు, ఆధునికీకరణ సాధ్యపడదని పార్లమెంటరీ కమిటీ తేల్చేసింది. ఈ నేపథ్యంలో రక్షణ శాఖ బడ్జెట్‌పై ఆర్థిక శాఖ నియంత్రణను సడలించి రక్షణశాఖకు స్వేచ్ఛనిచ్చే దిశగా ఈ బడ్జెట్‌లో అడుగులు పడతాయేమో చూడాలి. రక్షణ శాఖ కోసం నాన్‌లాప్సబుల్‌ ఫండ్‌ను ఏర్పాటు చేయాలన్న పార్లమెంటరీ కమిటీ సూచననూ ప్రభుత్వం పరిశీలిస్తుంది.

 ఇప్పటి వరకు ఆయుధాలకు అగ్రరాజ్యాలే ఆధారం

ఇప్పటి వరకు ఆయుధాలకు అగ్రరాజ్యాలే ఆధారం

ఆయుధాల కోసం భారత్‌... అగ్రరాజ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. క్లిష్ట సమయాల్లో ఆ దేశాలు భారత్‌ను దూరంపెట్టడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కార్గిల్‌ యుద్ధ సమయంలో ఏర్పడ్డ ఆయుధ కొరత పరిస్థితిని భారత్‌ ఎప్పడూ గుర్తుంచుకోవాలి. అప్పట్లో ఇజ్రాయెల్‌ ఆదుకోకపోతే భారత్‌ తీవ్రంగా నష్టపోయేది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలో మేకిన్‌ ఇండియాను ప్రోత్సహించాలి. ఇప్పటికే రక్షణ రంగ ఒప్పందాల్లో దళారుల జోక్యం, ఇతర కారణాలతో వేగం గణనీయంగా మందగిస్తోంది. కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే వదులుకోవాల్సి వస్తోంది. దీనికి 12ఎక్స్‌ మినీస్వీపర్స్‌ ప్రాజెక్టే ఉదాహరణ. గోవా షిప్‌యార్డ్‌లో దక్షిణ కొరియా సహకారంతో మినీస్వీపర్లను తయారు చేయాలని భావించారు. కానీ రూ.700 కోట్లు వెచ్చించాక సదరు కొరియా సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. మరో డీల్‌ కుదరాలంటే కొన్నేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మరోపక్క చైనా వద్ద మినీ స్వీపర్ల సంఖ్య 100 దాటింది. దీంతో భారత్‌కు అత్యవసరమైతే మళ్లీ రష్యా వంటి దేశాల నుంచి వాటిని లీజుకు తీసుకోవాల్సిందే. ఐఎన్‌ఎస్‌ కలవరి రాకతో నావికాదళానికి కొంత వెసులుబాటు దక్కినా.. చైనా నుంచి హిందూ మహాసముద్రంలో ఒత్తిడివ పెరిగిపోతోంది. దీంతో భారత్‌ 2020-21 నాటికి సబ్‌మెరైన్ల సంఖ్యను 22కు పెంచటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ సునీల్‌ లంబా తెలిపారు. కానీ ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆధునికీకరణకు కేటాయించే నిధుల మొత్తాన్ని గణనీయంగా పెంచాల్సి ఉంది.

 అత్యాధునిక తూటా రక్షక కవచాలు అవసరమే

అత్యాధునిక తూటా రక్షక కవచాలు అవసరమే

సైనిక రవాణకు ఉపయోగించే చీతా హెలికాప్టర్లు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఏకంగా ఆర్మీ చీఫ్ బిపిన్‌ రావత్‌ కూడా దాన్లో మృత్యువు దాకా వెళ్లి బయటపడ్డారు. యుద్ధరంగంలోని వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా రైఫిల్స్‌నీ మార్చాల్సి ఉంది. రాత్రివేళల్లో శత్రువుల దాడులు పెరిగాయి. దీంతో నైట్‌విజన్‌ హైటెక్‌ అసాల్ట్‌ రైఫిళ్లను వినియోగించాల్సిన పరిస్థితి. కానీ వీటి ధర చాలా ఎక్కువగా ఉంది. కనీసం సరిహద్దు గస్తీ బృందాలకైనా వీటిని అందివ్వాల్సిన అవసరం ఉందని ఆర్మీచీఫ్‌ రావత్‌ తెలిపారు. అత్యాధునిక తూటా రక్షక కవచాల్నీ సైనికులకు అందివ్వాల్సి ఉంది. వీటన్నిటినీ రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇప్పటికే గుర్తించారు. తదనుగుణంగా బడ్జెట్‌లో కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. దేశ భద్రతకు సంబంధించిన కీలక విషయాల్లో రక్షణ రంగ నిపుణుల భాగస్వామ్యం కొరవడుతోందనే విమర్శలున్నాయి. గతేడాది నీతి ఆయోగ్‌ 15 ఏళ్ల భవిష్యత్‌ ప్రణాళికను ప్రకటించింది. దీనిలో రక్షణ, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. కానీ ఈ ప్రణాళికను తయారు చేసిన బృందంలో ఒక్క రక్షణ అధికారి కూడా లేరు. ఇది విమర్శలకు తావిచ్చింది. అలాగే సాధారణంగా త్రివిధ దళాలు తమ అవసరాలను తెలియజేస్తూ రక్షణ శాఖకు నివేదికను పంపిస్తాయి. దీనికి కొన్ని సవరణలు చేసి రక్షణ శాఖ... ఆర్థిక శాఖకు పంపిస్తుంది. అక్కడ వీటికి కత్తిరింపులు జరిగి జాబితా తుదిరూపు పొందుతుంది. ఆర్థిక శాఖ జోక్యం పెరగటంతో దేశ రక్షణ అవసరాలు పట్టించుకోని పరిస్థితి నెలకొంటోందని అడపాదడపా విమర్శలు వస్తున్నాయి. చైనా, పాక్‌లకు దీటుగా బదులిస్తున్న మోదీ ప్రభుత్వం... వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని రక్షణ శాఖ అవసరాలు నెరవేరేలా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. దీర్ఘకాలిక ప్రణాళికనూ ప్రకటించొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+