Super Star: రజనీకాంత్ RRR, రజనీ రాడనుకున్నారా, రాలేడనుకున్నారా, మా సీఎం అభ్యర్థి, ఇది లీడర్స్ లెక్క!
చెన్నై/ న్యూఢిల్లీ: సౌత్ ఇండియా సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ రాజకీయ పయనం ఎటో ఈ రోజు తేలిపోతుంది. R అంటే రజనీకాంత్, R రాననుకున్నారా ?, R రాలేడనుకున్నారా ? అనే విషయంపై ఈ రోజు రజనీకాంత్ క్లారిటీ ఇవ్వనున్నారు. 2017 డిసెంబర్ 31వ తేదీన అభిమానులకు తాను కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నానని రజనీకాంత్ ఆయన అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదిగో... ఇదిగో అంటూ రజనీకాంత్ ఆయన రాజకీయ పార్టీ విషయంలో నాన్చుతూ వస్తున్నారు. రజనీకాంత్ తమిళనాడు అభ్యర్థి అంటూ ఆయన అభిన సంఘాల నాయకులు (ఫ్యాన్స్) సోమవారం చెన్నైలోని రజనీ మీటింగ్ జరుగుతున్న రాఘవేంద్ర కల్యాణ మండపం వేదిక దగ్గర భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు.

2017 డిసెంబర్ 31వ తేది గుడ్ న్యూస్.... కానీ ?
నేను రాజకీయాల్లోకి వచ్చేశాను, రజనీ మక్కల్ మండ్రం పార్టీతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొందామని 2017 డిసెంబర్ 31వ తేదీన చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రకటన చేశారు. రజనీకాంత్ రాజకీయ పార్టీ ప్రకటించి మూడేళ్లు అయిపోతుంది. రజనీ మక్కల్ మండ్రం పార్టీ ఏర్పాటు, ఆ పార్టీ కార్యవర్గం నియామకం, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జోరుగానే జరిగాయి. అయితే తమిళనాడులో జోరుగా జరిగిన రజనీ మక్కల్ మండ్రం కార్యవర్గ సభ్యత్వ నమోదు కార్యక్రమం తరువాత చల్లగా నీరుకారిపోయింది.

అమ్మ, కలైంజర్ లేని లోటు
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయతలిత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కలైంజర్ ఎం. కరుణానిధి మరణించిన తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ తెరమీదకు వచ్చింది. అమ్మ, అయ్య లేని టైమ్ లో రజనీకాంత్ ఆయన రాజకీయ పార్టీని చాలా జోరుగా ప్రకటించారు. రాజకీయ పార్టీ ప్రకటించిన తరువాత రజనీకాంత్ ఆయన జోరును పూర్తిగా తగ్గించేయడంతో ఆయన అభిమానులు చాలా నిరాశ చెందారు.

సమయం లేదు మిత్రమా
2021లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 10 సంవత్సరాలు అధికారం పూర్తి చేసుకుంటున్న అధికార పార్టీ అన్నాడీఎంకేతో పాటు ప్రతిపక్ష పార్టీ అయిన డీఎంకే 2021 అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. మరో వైపు యూనివర్శల్ హీరో కమల్ హాసన్ సైతం ఆయన పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయించడానికి రంగం సిద్దం చేస్తున్నారు. తమిళనాడులో ఇంత జరుగుతున్నా రజనీకాంత్ మాత్రం ఆయన రాజకీయ పార్టీ గురించి ఇంత వరకు కీలక ప్రకటన చెయ్యలేదు.

తలైవా తమిళనాడు సీఎం అభ్యర్థి
సోమవారం చెన్నైలోని కోడంబాక్కంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ కు చెందిన రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీ మక్కల్ మండ్రం పార్టీ నాయకుల సమావేశం ప్రారంభం అయ్యింది. తమిళనాడులోని 38 జిల్లాలకు చెందిన 52 మంది రజనీ పార్టీ అభిమాన సంఘాల ముఖ్య నాయకులు, రజనీ మక్కల్ మండ్రం పార్టీ కార్యవర్గ సభ్యులు హాజరైనారు. తమిళనాడు సీఎం అభ్యర్థి రజనీకాంత్ అంటూ రాఘవేంద్ర కల్యాణ మండపంలో ఆయన అభిమానులు జోరుగా నినాదాలు చేస్తున్నారు.

బయట సేమ్ సీన్
కోడంబాక్కంలోని రహదారులు ఇరు వైపుల రజనీకాంత్ అభిమానులతో దర్శనం ఇస్తున్నారు. రజనీకాంత్ ఫోటోలు, మీరు రాజకీయాల్లో రావాలని నినాదాలు రాసిన బోర్డులు చేతిలో పట్టుకుని నిలబడిపోయారు. రజనీకాంత్ ఈ రోజు ఎలాంటి కీలక ప్రకటన చేస్తారు ? అంటూ తమిళనాడు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రాజకీయాల్లోకి రావడమా... సైలెంట్ గా సినిమాలు తీసుకోవడమా ? లేదా వేరే పార్టీకి మద్దతు ఇవ్వడమా ? అనే విషయంలో ఈ రోజు రజనీకాంత్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications