తమిళనాడు మంత్రికి అవమానం: ఎయిర్పోర్టులో ఆపిన సిబ్బంది.. ఇదీ కారణం..
తమిళనాడు ఆర్థిక మంత్రి పళనివేల్ త్యాగరాజన్కు అవమానం జరిగింది. విమానాశ్రయ సిబ్బంది ఆయనను ఆపివేశారు. రెండు ల్యాప్టాప్లతో ప్రయాణిస్తోన్న ఆయనను విమానం ఎక్కేందుకు అనుమతించలేదు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. ఒకే ల్యాప్టాప్తో విమానంలో ప్రయాణించేందుకు అనుమతి ఇస్తామని సీఐఎస్ఎఫ్ సిబ్బంది తెగేసి చెప్పారు. ఈ ఘటన నిన్న ఉదయం ఐదున్నర గంటలకు జరిగింది.
చెన్నై నుంచి ట్యూటికోరిన్ వెళ్లేందుకు మంత్రి పళనివేల్ త్యాగరాజన్.. ప్రయాణీకుడి మాదిరిగా చెన్నై విమానాశ్రయంలోని డెమెస్టిక్ టెర్మినల్కు చేరుకున్నారు. భద్రతాపరమైన స్కానింగ్ కోసం తన బ్యాగును భద్రతా సిబ్బందికి ఇచ్చారు. బ్యాగులో రెండు ల్యాప్టాప్లు ఉన్నాయని సీఐఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ప్రయాణీకుడు ఒక ల్యాప్టాప్ తీసుకుని వెళ్లొచ్చని స్పష్టంచేశారు. రెండు ల్యాప్టాప్లు తీసుకెళ్లేందుకు నిబంధనలు అనుమతించవని మంత్రికి తెగేసిచెప్పినట్టు సమాచారం. అలాంటి నిబంధన లేవని సీఐఎస్ఎఫ్ అధికారులతో మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాగ్వివాదానికి దిగారు.

ఆలస్యంగా ఆయన రాష్ట్ర మంత్రి అనే విషయం తెలుసుకున్నారు. అక్కడకు చేరుకుని మంత్రికి క్షమాపణ చెప్పినట్టు తెలుస్తోంది. సీఐఎస్ఎఫ్ అధికారులకు తమిళ్ అర్థం కానందునే వివాదం ఏర్పడినట్లు విమానాశ్రయ అధికారులు వెర్షన్. ల్యాప్టాప్ బ్యాగును ట్రేలో పెట్టాలని ఉత్తరాదికి చెందిన సీఐఎస్ఎఫ్ సబ్ ఇనిస్పెక్టర్ హిందీలో మంత్రికి సూచించారని.. దీన్ని మంత్రి మరోరకంగా అర్థం చేసుకున్నారని వివరించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. స్కానింగ్ దగ్గర ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అధికారులు తెలిపారు. విమానాశ్రయ సీనియర్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని.. మంత్రికి సారీ చెప్పారని విమానాశ్రయ వర్గాలు తెలిపారు.
గత ఏడాది ఆగస్టులో కూడా ఇలాంటి ఘటన ఒక్కటి జరిగింది. చెన్నై విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్ మహిళా అధికారి తనను అవమానించారని డీఎంకే ఎంపీ కనిమొళి ఆరోపించారు. ఇంగ్లీష్ లేదా తమిళ్లో మాట్లాడాలని సీఐఎస్ఎఫ్ అధికారిని కోరగా.. మీరు భారతీయులేనా అని సదరు అధికారి ప్రశ్నించినట్లు అప్పట్లో కనిమొళి ఆరోపించారు. తమిళ లాంగ్వేజ్ గుర్తించకపోవడం.. తమ భాషకు జరిగిన అవమానంగా ఆమె ఆరోపించారు.












Click it and Unblock the Notifications