పునీత్ రాజ్కుమార్ భార్యను పరామర్శించిన మంత్రి పెద్దిరెడ్డి: భావోద్వేగంతో.. నివాళి
చిత్తూరు/బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండిల్వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కుటుంబాన్ని ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పరామర్శించారు. పునీత్ నిలువెత్తు చిత్రపటానికి నివాళి అర్పించారు. కంఠీరవ స్టూడియోలో పునీత్ రాజ్కుమార్ సమాధిని సందర్శించారు. రాజ్కుమార్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. భావోద్వేగానికి గురయ్యారు.
ఈ ఉదయం ఆయన తన సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నుంచి రోడ్డు మార్గంలో బెంగళూరుకు చేరుకున్నారు. సదాశివ నగరలో ఉన్న పునీత్ రాజ్కుమార్ నివాసానికి వెళ్లారు. పునీత్ రాజ్కుమార్ నివాసంలో ఏర్పాటు చేసిన నిలువెత్తు చిత్రపటానికి నివాళి అర్పించారు. ఆయన భార్య అశ్విని రేవంత్ను కలుసుకున్నారు. చాలాసేపు మాట్లాడారు. ధైర్యం చెప్పారు. రాజ్కుమార్ కుటుంబంతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.
పునీత్ తండ్రి, దివంగత రాజ్కుమార్తో తనకు సాన్నిహిత్యం ఉందని గుర్తు చేసుకున్నారు. పునీత్ రాజ్కుమార్ అకాల మరణం తనను తీవ్రంగా కలచి వేసిందని పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. ఓ నటుడిగా.. అంతకుమించి సమాజానికి సేవ చేయాలనే తపన ఉన్న ఓ గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఓ ఉన్నత కుటుంబంలో జన్మించినా.. స్టార్ హీరో హోదాను పొందినా.. ఓ సామాన్యుడిలా అందరితోనూ కలిసిపోయే మనస్తత్వం, ప్రతి ఒక్కరినీ ఆదరించే గుణం అతి కొద్దిమందికే ఉంటుందని, అలాంటి వారిలో పునీత్ రాజ్కుమార్ అగ్రస్థానంలో ఉంటారని చెప్పారు.
Recommended Video
అనంతరం ఆయన కంఠీరవ స్టూడియోకు వెళ్లారు. పునీత్ రాజ్కుమార్ సమాధికి నివాళి అర్పించారు. చిన్న వయస్సులోనే పునీత్ వంటి గొప్ప వ్యక్తిని కోల్పోవడం బాధాకరమని పెద్దిరెడ్డి చెప్పారు. కన్నడ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా.. సమాజానికి కూడా తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. పునీత్ రాజ్కుమార్ చిరస్మరణీయుడని, ఆయన చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని వ్యాఖ్యానించారు.