మంత్రి పెద్దిరెడ్డిని నియోజకవర్గంపై టార్గెట్: ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ ఆరా: పుంగనూరుకు
చిత్తూరు: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చిత్తూరు జిల్లాలో పర్యటించబోతోన్నారు. కాస్సేపట్లో ఆయన పర్యటన ప్రారంభం కాబోతోంది. ఆయన నిర్వహించబోతోన్న ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సొంత నియోజకవర్గాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ టార్గెట్గా చేసుకున్నట్లు కనిపిస్తోంది. పెద్దిరెడ్డి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న పుంగనూరు అసెంబ్లీ పరిధిలోని పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం, పెద్ద ఎత్తున ఏకగ్రీవాలు నమోదు కావడంపై ఆరా తీయనున్నారు.
పుంగనూరు నియోజకవర్గంలో మూడో విడత ఎన్నికలను ఎదుర్కొంటోన్న పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం 85 సర్పంచ్, 848 వార్డు స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉండగా.. స్క్రూటినీ సందర్భంగా వైఎస్సార్సీపీ మద్దతుదారుల నామినేషన్లు తప్ప మిగిలినవి తిరస్కరణకు గురయ్యాయి. ఉపసంహరణల గడువు కూడా ముగియడంతో శుక్రవారం వైసీపీ మద్దతుదారులందరూ ఏకగ్రీవంగా గెలుపొందినట్లు స్థానిక రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. పెద్ద ఎత్తున నామినేషన్లు తిరస్కరణకు గురి కావడం, ఏకగ్రీవాలు నమోదు కావడం వల్ల అక్కడ అక్రమాలు చోటు చేసుకుని ఉండొచ్చనే ఫిర్యాదులు అందాయి.

తమ నామినేషన్లను తిరస్కరించడంపై తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, స్వతంత్ర అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు కొందరు ఏపీ హైకోర్టును సైతం ఆశ్రయించారు. నామినేషన్ల తిరస్కరణపై పిటిషన్లను దాఖలు చేశారు. పుంగనూరులో పంచాయతీ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఏకగ్రీవాలు నమోదైన అన్ని పంచాయతీల్లోనూ ఆయన పర్యటిస్తారని, నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications