చెట్టుకు కట్టేసి.. వేళ్లు నరికేసీ.. సీపీఐ నారాయణ మరోసారి హాట్ కామెంట్స్
సీపీఐ నారాయణ.. ఓ సంచలనం.. ఆయన ఏం చేసినా హాట్ టాపికే.. ప్రత్యర్థులను సైతం తనదైన మాటలతో ఆకట్టుకుంటారు. అప్పట్లో నిత్యం వార్తల్లో ఉండేవారు. కానీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక కాస్త తగ్గారు. ఆడపా దడపా మాత్రమే కామెంట్స్ చేస్తున్నారు. పక్కా కమ్యునిస్టుల మాట్లాడుతుంటారు. ఇటీవల ఏపీ సర్కార్పై విరుచుకుపడుతున్నారు. తాజాగా కూడా హాట్ కామెంట్స్ చేశారు.
సీపీఐ జాతీయ నాయకులు నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవాలని చూస్తే సిబ్బందిని చెట్టుకు కట్టేసి, వేళ్ళు నరికేస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లాలో ఈ మేరకు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు - తచ్చూరు జాతీయ రహదారి కోసం రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకోబోమన్నారు. భూములు ఇవ్వకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామని రైతులను బెదిరించడం దుర్మార్గమని పేర్కొన్నారు. అలా చేస్తే మీ చేతి వేళ్ళు కూడా కట్ చేస్తామని సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు.
బలవంతంగా సంతకాలు తీసుకునేందుకు అధికారులు రైతుల ఇంటి వద్దకు వస్తే వారిని చెట్టుకు కట్టేస్తామని చెప్పారు. బాధితులకు అండగా ఉండడం కోసమే గ్రామాల వెంబడి సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నారాయణ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. దీనిపై అధికార పార్టీ స్పందించాల్సి ఉంది. అధికారులను టార్గెట్ చేసి నారాయణ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video
ఇప్పుడే కాదు గతంలో కూడా పలుమార్లు నారాయణ ఇలానే కామెంట్స్ చేశారు. అధికారులనే కాదు.. సీఎంలను, పార్టీ అధినేతలను, మంత్రులను, సీనియర్ నేతలను వదల్లేదు. కామెంట్ చేసి.. కాంట్రవర్సీకి తెరలేపేవారు. ఇటు గాంధీ జయంతి రోజున నారాయణ చికెన్ తిన్నారు. పొరపాటున తిన్నానని.. ఏడాదిపాటు చికెన్ తిననని చెప్పారు. సంవత్సరం తర్వాతే నాన్ వెజ్ ఆరగించారు.