వైఎస్ జగన్ వద్ద మార్కులు కొట్టేసిన రోజా..!!
చిత్తూరు: బంగాళాఖాతంలో ఏర్పడిన పెను తుఫాను మాండోస్ తీరం దాటిన తరువాత కూడా తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు ఇంకా కురుస్తోన్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తోన్నాయి. ఏపీ సహా తమిళనాడు, కర్ణాటకల్లో ఇదే పరిస్థితి నెలకొంది. పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మాండోస్ తుఫాన్.. అర్ధరాత్రి మహాబలిపురం వద్ద తీరం దాటిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇది బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఇప్పుడు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, కడప, అన్నమయ్య, శ్రీసత్యసాయి పుట్టపర్తి, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. పలు చోట్ల మధ్యాహ్నం వరకూ ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది.
ఈ పరిస్థితుల్లో కూడా పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా- గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని తన సొంత నియోజకవర్గం నగరి పరిధిలో ఆమె ఇవ్వాళ విస్తృతంగా పర్యటించారు. రాత్రి వరకూ గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్నారు. నియోజకవర్గం పరిధిలోని పుత్తూరు మండలం పరమేశ్వర మంగళం సచివాలయం పరిధిలోని ఇళ్లకు వెళ్లారు. స్థానికులను కలుసుకున్నారు. వారి అవసరాలను అడిగి తెలుసుకున్నారు.
పరమేశ్వర మంగళం, వడ్డి ఇండ్లు గ్రామాల్లో రోజా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లారు. వారికి ప్రభుత్వం మంజూరు చేసిన సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. సకాలంలో ఫలితాలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. వర్షం పడుతుండటంతో గొడుగు పట్టుకుని, జర్కిన్ వేసుకుని ప్రజలను కలుసుకున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, నవరత్నాలను ముద్రించిన బ్రోచర్లను రోజా వారికి అందించారు. గ్రామస్తులు చెప్పిన సమస్యలను సావధానంగా పరిష్కరించారు. వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. తనతో పాటు వచ్చిన గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, స్థానిక రెవెన్యూ అధికారులకు దీనికి అవసరమైన ఆదేశాలను జారీ చేశారు ఆర్ కే రోజా. వెంటనే అవన్నీ పరిష్కారం అయ్యేలా చూడాలని చెప్పారు.