చిలగడదుంపల మాటున గంజాయి రవాణా .. 2000 కిలోల కోటి రూపాయల విలువైన గంజాయి సీజ్
ఏపీ గంజాయి అక్రమ రవాణాకు అడ్డగా మారిపోయింది. విశాఖ ఏజెన్సీలో గంజాయి గుప్పుమంటుంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతున్నారు. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆ మధ్య అంబులెన్స్ లో బొగ్గు లారీలో సిమెంట్ ఇటుకల లారీలలో గంజాయి అక్రమ రవాణా జరిగితే ఇప్పుడు చిలకడ దుంపల మాటున గంజాయి అక్రమ రావాణాకు తెరతీశారు గంజాయి స్మగ్లర్లు .

తూర్పుగోదావరి జిల్లాలో కోటి విలువైన గంజాయిని పట్టుకున్న పోలీసులు
గంజాయి తెలుగు రాష్ట్రాల్లో ఎంత పటిష్టమైన నిఘా ఉన్నా విచ్చలవిడిగా అక్రమరవాణా జరుగుతుంది. స్మగ్లర్లు ఎవరికీ దొరకకుండా రోజుకో మార్గాన్ని గంజాయి తరలింపుకు ఉపయోగించుకుంటున్నారు. పక్కా సమాచారం ఉంటే తప్ప గంజాయిని పట్టుకోలేని పరిస్థితి అటు పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు ఇబ్బందికరంగా మారుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మన్యం నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న రూ.కోటి విలువైన గంజాయిని పట్టుకున్నారు పోలీసులు .

చిలగడ దుంపల మాటున 2 వేల కిలోల శీలావతి గంజాయి తరలింపు
రెండు వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు గంజాయిని చిలగడ దుంపల మాటున తరలిస్తున్నట్టు సమాచారం అందటంతో తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. మోతుగూడెం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ జిల్లా చింతపల్లి నుంచి వ్యాన్లో గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మోతుగూడెం పోలీసులు ఎదురు డిపోవద్ద వాహన తనిఖీలు చేపట్టారు. వ్యాన్లో సుమారు రెండు వేల కేజీల శుద్ధి చేసిన శీలావతి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నలుగురు అరెస్ట్.. నలుగురు పరారీ
ఇక ఈ కేసులో గంజాయిని తరలిస్తున్న కిల్లో కృష్ణ, కిల్లో ఆనంద్, గుమ్మల నారాయణ, సానెల కృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను రంపచోడవరం కోర్టులో హాజరుపరచనున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు గంజాయి తరలించే వ్యాన్ ను సీజ్ చెయ్యటంతో పాటు , స్మగ్లర్స్ వినియోగించిన కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.












Click it and Unblock the Notifications