జైలు నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల..!!
రాజమండ్రి: కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు విడుదల అయ్యారు. 211 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవలే ఆయనకు రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కోర్టు- షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. ఈ బెయిల్ ప్రక్రియ ముగియడంతో ఈ సాయంత్రం రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి బయటికి వచ్చారు.
తన వద్ద కారు డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యం హత్య కేసులో పోలీసులు ఎమ్మెల్సీ అనంతబాబును నిందితుడిగా నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 23వ తేదీన ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం ఆయనను న్యాయస్థానం రిమాండ్కు పంపించింది. అప్పటి నుంచి రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ కోసం పలుమార్లు ప్రయత్నాలు సాగించినప్పటికీ.. అవి విఫలమౌతూ వచ్చాయి.

చివరికి ఆయన బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసుకున్న పిటీషన్ను సమగ్రంగా విచారణ చేపట్టిన తరువాత సుప్రీంకోర్టు- ఈ పిటీషన్పై అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రత్యేక న్యాయస్థానం- ఇటీవలే ఎమ్మెల్సీ అనంతబాబుకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది.
దీనికి సంబంధించిన ప్రక్రియ ఇవ్వాళ ముగిసింది. దీనితో ఈ సాయంత్రం ఆయన రాజమండ్రి కేంద్ర కారాగారం నుంచి విడుదల అయ్యారు. 50 వేల రూపాయల పూచికత్తుపై ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. సాక్షులను భయ బ్రాంతులకు గురి చేయకూడదని, కేసుకు సంబంధించి ప్రతి వాయిదాకి తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. విదేశాలకు వెళ్లకూడదని తెలిపింది. పాస్పోర్టును కోర్టులో స్వాధీనం చెయ్యాలని ఆదేశించింది.












Click it and Unblock the Notifications