శైవ క్షేత్రాలకు టూర్ ప్యాకేజీ
IRCTC: ఈ నెల 26వ తేదీన మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని శైవక్షేత్రాలు భక్తులతో పోటెత్తుతుంటాయి. భక్తుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రఖ్యాత శైవక్షేత్రాలను కలుపుతూ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. అయిదు రాత్రులు/ఎనిమిది పగళ్లు సాగే యాత్ర ఇది. ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు కొనసాగుతుంది. ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ బయలుదేరుతుంది.

ఈ ప్యాకేజీలో మధురై- రామేశ్వరం- కన్యాకుమారి- తిరువనంతపురం- కోవలం బీచ్ ఉన్నాయి. కన్యాకుమారిలో వివేకానంద రాక్ మెమోరియల్, గాంధీ మండపం, అక్కడి ఆలయాన్ని సందర్శించవచ్చు. తిరువనంతపురంలో ప్రఖ్యాత అనంత పద్మనాభ స్వామివారి ఆలయం, కోవలం బీచ్ను చూడొచ్చు.
రామేశ్వరంలో వెలిసిన శ్రీ రామనాథ స్వామి ఆలయం, మధురైలో మీనాక్షి అమ్మవారి ఆలయం ఈ ప్యాకేజీలో ఉంది. ఈ ప్యాకేజీ కోసం సింగిల్ ఆక్యుపెన్సీ కింద మొత్తం 53,500 రూపాయలు. డబుల్ ఆక్యుపెన్సీ- 40,800, ట్రిపుల్ ఆక్యుపెన్సీ- 39,100 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది.
బెడ్తో కలిపి 5 నుంచి 11 సంవత్సరాల వరకు వయస్సు ఉన్న పిల్లలకు రూ. 32,300, బెడ్ రహితంగా 29,000 రూపాయలు కట్టాలి. 2 నుంచి 4 సంవత్సరాల్లోపు పిల్లలకు 28,400 రూపాయల ఛార్జీ చెల్లించాలి.
దేశంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను అనుసంధానిస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ.. భారత్ గౌరవ్ పేరుతో ఈ ప్రత్యేక రైళ్లను నడిపిస్తోన్న విషయం తెలిసిందే. వీటికి ప్రయాణికుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. ప్రారంభమైన అన్ని చోట్ల కూడా ప్రయాణికుల ఆదరణ భారీగా ఉంటోంది.












Click it and Unblock the Notifications