పోలేరమ్మకు నైవేద్యం సమర్పించడానికి వెళ్తుండగా: మందడంలో మహిళల అరెస్టు: చుట్టూ ఫెన్సింగ్:.!
అమరావతి: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు శుక్రవారం నాటికి 24వ రోజుకు చేరుకున్నాయి. ఇన్ని రోజులుగా తాము నిరసన దీక్షలను కొనసాగిస్తున్నప్పటికీ.. ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడం, మంత్రులు, ఇతర అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెయిడ్ ఆర్టిస్టులంటూ రైతులను కించపర్చడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.
అమ్మవారికి పూజలను అడ్డుకున్న పోలీసులు..
మంత్రుల తీరుకు నిరసనగా ఈ ఉదయం నిరసనగా మంత్రుల నివాసాల ముట్టడికి పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికోసం రాజధాని గ్రామాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరింపజేశారు. ప్రత్యేకించి- తుళ్లూరు, మందడం గ్రామాల్లో ఉద్రిక్తతల తీవ్రత అధికంగా ఉంటోంది. శుక్రవారాన్ని పురస్కరించుకుని మందడం గ్రామదేవత పోలేరమ్మ గుడికి వెళ్తున్న మహిళలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

గ్రామాల చుట్టూ ఫెన్సింగ్..
అమ్మవారికి నైవేద్యాన్ని తీసుకెళ్లడానికి సిద్ఢపడిన పలువురు మహిళలను పోలీసులు ఇళ్ల వద్దే అడ్డుకున్నారు. వారిని బయటికి రానివ్వలేదు. కొందరు మహిళలు అమ్మవారికి గుడికి వెళ్లగా.. అక్కడా అదే పరిస్థితి ఏర్పడింది. అమ్మవారికి గుడి వద్ద పూజలు చేస్తోన్న మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా.. వారు ప్రతిఘటించారు. మందడం, తుళ్లూరు గ్రామాల్లో బయటి వారెవరూ రాకుండా ఉండటానికి ఫెన్సింగ్లను ఏర్పాటు చేశారు.
పోలీసులతో వాగ్వివాదం..
దీనితో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు భక్తులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అదుపులోకి తీసుకునే క్రమంలో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించడానికి కూడా అనుమతి కావాాలా? అంటూ మహిళలు పోలీసులపై మండిపడ్డారు. పోలీసుల ఆంక్షలతో అమ్మవారికి పూజలు కూడా చేయలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున పెద్ద సంఖ్యలో ఎవరూ గుమికూడదని పోలీసులు వారిని నచ్చజెప్పడానికి ప్రయత్నించినప్పటికీ.. ఫలితం దక్కలేదు.












Click it and Unblock the Notifications