టీడీపీకి మరో సిట్టింగ్ ఎమ్మెల్యే గుడ్ బై..! సీఎంతో మద్దాళి గిరి భేటీ: వంశీ తరహాలోనే..!
తెలుగుదేశం పార్టీకి మరో షాక్. మరో సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ నుండి జంప్. వైసీపీలో చేరాలని నిర్ణయం. రాజధాని మార్పు రగడ కారణంగా గుంటూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల పైన రాజకీయంగా పై చేయి సాధించేందకు ప్రయత్నిస్తున్న టీడీపీకి ఊహించని షాక్ తగిలింది. తాజా ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాళి గిరి టీడీపీ వీడాలని నిర్ణయించారు. ఆయన ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. అధికారికంగా వైసీపీలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉండటంతో..గిరి సైతం గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరహాలోనే ముందుగా టీడీపీకి దూరమై వైసీపీకి మద్దతుగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ టీడీపీ నుండి వైసీపీలోకి మద్దాళి గిరిని తీసుకురావటంలో కీలక పాత్ర పోషించారు.
జగన్ కావాలా..జనం కావాలా: వైసీపీ అమరావతి నేతలకు అల్టిమేటమ్: టీడీపీ మైండ్ గేమ్..!
టీడీపీకి మరో ఎమ్మెల్యే దూరం..
2019 ఎన్నికల్లో టీడీపీ నుండి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వారిలో ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి రాజానామా చేసారు. అసెంబ్లీలో నేరుగా స్పీకర్ ను తనకు టీడీపీతో కాకుండా స్వతంత్ర సభ్యుడిగా గుర్తించాలని కోరటంతో ఆయన ప్రస్తుతం అసెంబ్లీ రికార్డుల ప్రకారం స్వతంత్ర సభ్యుడిగా ఉన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్ ఇతర పార్టీల నుండి ఎవరు వచ్చినా.. ముందుగా తమ పార్టీకి..పార్టీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేసి రావాల్సిందేనని..అలా రాకుంటే వారి పైన అనర్హత వేటు పడుతుందని స్పష్టం చేసారు. దీంతో..ఎమ్మెల్యే వంశీ పార్టీకి మాత్రమే రాజీనామా చేసి ఎమ్మెల్యే గా కొనసాగుతున్నారు. ఇక, ఇప్పుడు అదే తరహాలో ఇతర ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకోవాటానికి వైసీపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా..ఈ రోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే గా ఎన్నికైన మద్దాళి గిరి పార్టీ వీడి వైసీపీకి మద్దతుగా నిలవాలని నిర్ణయించారు.
వంశీ తరహాలోనే గిరి సైతం..
ఈ రోజు టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు పర్యటనకు వచ్చారు. జిల్లా జైలులో ఉన్న రాజధాని ప్రాంత రైతులను పరామర్శించారు. స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మద్దాళి గిరి ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇక, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన సామాజిక వర్గానికే చెందిన మద్దాళి గిరిని వైసీపీలోకి తీసుకొచ్చేందుకు ఒప్పించారు. ఇదే విషయం పైన ముఖ్యమంత్రిని సైతం ఒప్పంచటం ద్వారా గిరి సైతం వంశీ బాటలోనే పయణించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు వైసీపీలో చేరే పరిస్థితి లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ గా ప్రస్తుతం మాజీ డీఐజీ యేసురత్నం వ్యవహరిస్తున్నా రు. మద్దాళి గిరి రావటం ద్వారా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో టీడీపీని మానసికంగా దెబ్బ కొట్టటం వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది.
రాజధాని ప్రాంతంలోనే ఎమ్మెల్యే ద్వారా..
అమరావతి నుండి రాజధాని తరలింపు ప్రతిపాదన పైన టీడీపీ పరోక్షంగా రైతులను రెచ్చగొడుతోందని వైసీపీ భావిస్తోంది. ఇదే సమయంలో రాజధాని ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలనే తమ వైపు తిప్పు కోవటం ద్వారా టీడీపీ వాదన ఆ పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారనే సంకేతాలు ఇచ్చేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాజధాని ప్రాంతం ఉన్న జిల్లా కేంద్రంలోని టీడీపీ ఎమ్మెల్యేను ఆ పార్టీకి దూరం చేయటం ఈ వ్యూహంలో భాగంగానే కనిపిస్తోంది. ఇదే బాటలో గుంటూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే సైతం ఉన్నారని తెలుస్తోంది. అయితే, వీరంతా నేరుగా వైసీపీలో చేరే పరిస్థితి లేకపోవటంతొ..వైసీపీకి అనుబంధంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తొంది. దీని పైన టీడీపీ నేతలు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.