అత్యాచార బాధితురాలికి పరామర్శ: చంద్రబాబు డిమాండ్స్.. హోంమంత్రి సాయం
అమరావతి: గుంటూరులో అత్యాచారానికి గురైన బాలికను, ఆమె కుటుంబాన్ని ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం పరామర్శించారు. గుంటూరు ఆస్పత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి..
గుంటూరులో జరిగిన ఈ అవమానవీయ ఘటన బాధాకరమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చట్టాలు తేవడం ఎంత ముఖ్యమో వాటిని అమలు చేయడంలో కూడా ప్రభుత్వానికి అంతే చిత్తశుద్ధి ఉండాలని చంద్రబాబు నాయుడు హితవు పలికారు. బాలికపై అత్యాచారం జరిగితే బాధిత కుటుంబాన్ని ఇప్పటి వరకు ప్రభుత్వం తరపున ఎవ్వరూ కూడా ఎందుకు పరామర్శించలేదని చంద్రబాబు నిలదీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా ఇంతవరకు రాలేదని అన్నారు. నిందితుడు లక్ష్మారెడ్డిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దోషులను కఠినంగా శిక్షించినప్పుడే అటువంటి ఆలోచన చేసేవారిలో భయం పుడుతుందని అన్నారు.
న్యాయం చేయాలంటూ చంద్రబాబు డిమాండ్లు
దిశ చట్టం చేశామని, 21 రోజుల్లో శిక్షలు వేస్తామని చెప్పుకుంటున్న జగన్ సర్కారు.. ఇప్పుడెందుకు చొరవ తీసుకోవడం లేదని చంద్రబాబు ప్రశ్నించారు. అత్యాచార బాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి టీడీపీ తరపున రూ. 50వేలు ఆర్థిక సాయం చేశారు చంద్రబాబు. అన్ని విధాలా అండగా ఉంటామని చెప్పారు. బాధితురాలి పేరిట రూ. 25లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలన్నారు. అంతేగాక, ఉన్నత చదువు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే ఆ ఖర్చులు భరించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏఎన్ఎంగా పనిచేస్తున్న బాధితురాలి తల్లికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు ఇంటి స్థలం కేటాయించాలన్నారు.
హోంమంత్రి పరామర్శ
ఇది ఇలావుండగా, ఏపీ హోంమంత్రి సుచరిత కూడా అత్యాచార బాధిరాలిని మంగళవారం పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. బాలికపై అత్యాచారం జరగడం అత్యంత బాధాకరమని, ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారని, తగిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
సాయమందించిన మంత్రి సుచరిత
బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. 5లక్షల చెక్కును మంత్రి సుచరిత అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ. 5 లక్షలు, చదువు నిమిత్తం రూ. 2 లక్షలు, పోక్సో చట్టం కింద రూ. 25వేలు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రూ. 2.50లక్షలు అందజేస్తామని మంత్రి తెలిపారు. బాధిత కుటుంబానికి వచ్చే ఉాగాది నాటికి ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి సుచరిత హామీ ఇచ్చారు. బాధితురాలి తల్లికి డీఎంహెచ్వో కార్యాలయంలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. దిశ చట్టం ద్వారా నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేస్తామని చెప్పారు.