మంత్రి బుగ్గనపై బీజేపీ నేత, మాజీ మంత్రి రావెల ఫైర్ ..10 కోట్ల పరువు నష్టం దావా వేస్తానని ప్రకటన
ఏపీలో రాజధానిపై రగడ కొనసాగుతున్న సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రాజకీయవేడిని మరింత పెంచాయి. అమరావతిలో రాజధాని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముందే పార్టీ నేతలకు లీక్ చేశారని, దాంతో టీడీపీ నేతలు అమరావతిలో భూములను కొని ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ వైసీపీ నేతలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంతే కాదు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిన టీడీపీ నేతల పేర్లు ప్రకటించి మరీ ఆరోపణలు చేశారు.

ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారంటూ రావెలపై ఆరోపణలు .. మండిపడిన బీజేపీ నేత
టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు,పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర, పరిటాల శ్రీరాం, నారాయణ, వంటి వారికి భూములున్నట్లు పేర్కొన్న వారు ఆ లిస్టులో నాటి టీడీపీ నేత మాజీ మంత్రి రావేల కిషోర్ బాబు పేరు కూడా ప్రకటించారు . నేడు విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. దీంతో తనపై గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేత రావేల కిషోర్ బాబు . రాజధానిలో తనకు భూములు ఉన్నాయని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని చెప్పిన రావెల తాను అద్దె ఇంట్లో ఉంటున్నానని చెప్పుకొచ్చారు .

ఆరోపణలు చేసిన బుగ్గనపై పరువు నష్టం దావా వేస్తానన్న రావెల
కుటుంబ పోషణ కష్టతరం గా ఉన్న తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదన్నారు . ఒక దళిత నాయకుడిగా స్వయంకృషితో ఎదిగిన తనపై ఇలాంటి ఆరోపణలు చేయడం ఎంత వరకు న్యాయమో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై ఆరోపణలు చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డిపై పరువు నష్టం దావా కేసు వేస్తున్నానని మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిశోర్ బాబు తెలిపారు. తనపై మంత్రి బుగ్గన నిరాధార ఆరోపణలు చేశారని.. అందుకే ఆయనపై రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మీడియా ముఖంగా రావెల స్పష్టం చేశారు.

బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
బుగ్గనపై పరువు నష్టం కేసుతో వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు . తన నోటీస్ అందిన తర్వాత అయినా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు . ఎస్సీ, ఎస్టీ మనోభావాలు దెబ్బతినేలా బుగ్గన వ్యాఖ్యలు చేస్తున్నారని రావెల కిషోర్ బాబు చెప్పుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం రాజధానిని నాశనం చేస్తుందని ఆరోపించారు. తనపై చేసిన ఆరోపణలకు తగిన మూల్యం చెల్లించాలని చెప్పారు .












Click it and Unblock the Notifications