గ్రామ వలంటీర్ల పథకం వెనుక అతి పెద్ద దోపిడీ: శాసన మండలిలో నారా లోకేష్!
అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని ప్రభుత్వంపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యుడు నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న గ్రామ వలంటీర్ల పథకాన్ని అడ్డు పెట్టుకుని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గ్రామ వలంటీర్ల పేరుతో వైఎస్ జగన్ ప్రభుత్వం అతి పెద్ద దోపిడీకి తెర తీసిందని ఆరోపించారు. ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని ఆధారంగా చేసుకున్న లోకేష్.. ప్రభుత్వంపై పలు ఆరోపణలు గుప్పించారు.
అందినట్టే అంది..! అధికారం కోసం మహారుద్రయాగం చేయబోతున్న మాజీ ముఖ్యమంత్రి!
మంగళవారం ఆయన శాసన మండలిలో పలు అంశాలపై మాట్లాడారు. గ్రామ వలంటీర్ల పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద దోపిడీ పథకానికి శ్రీకారం చుట్టిందని ఆరోపించారు. గ్రామ వలంటీర్లుగా పనిచేయడానికి ఏ అర్హత అవసరంలేదని, వైఎస్ఆర్ సీపీ కార్యకర్త అయితే చాలని ఆయన విమర్శించారు. ఈ ఉద్యోగ ఎంపిక మొత్తం ఓ షో మాత్రమేనని అన్నారు. గ్రామ వలంటీర్ల పథకానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల దోపిడీ పథకం' అని పేరు పెట్టాల్సిందని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తల కోసం 1800 కోట్ల రూపాయల దోపిడీకి తెర లేపారని నారా లోకేష్ మండిపడ్డారు.
రాష్ట్రంలో కోటి 72 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే.. గ్రామ వలంటీర్ల పథకం కింద అయిదు లక్షల మందికి ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నారని ప్రశ్నించారు. గ్రామాల్లో మూడు లక్షలమందికి, పట్టణాల్లో 91 వేల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం చెబుతోందని, మిగిలిన కోటి 66 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితేమిటని ఆయన నిలదీశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆరు లక్షల మందికి రెండు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి కల్పించామని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ఈ పథకం అమలు కాలేదని అన్నారు. అలాంటి నిరుద్యోగ భృతిని ఎందుకు ఎత్తేశారని నిలదీశారు.