ఆ వైసీపీ ఎమ్మెల్యేకి మళ్లీ కరోనా-జనం బెంబేలు- గతానుభవాలతో
గతేడాది కరోనా మంచి పీక్లో ఉన్నప్పుడు వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యేకి కరోనా సోకింది. అప్పట్లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారి నుంచి ఆ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. ఆయన అదేమీ పట్టించుకోకుండా జనంలో తిరిగేయడంతో అప్పట్లో ఆయన నుంచి చాలా మందికి వ్యాపించింది. ఆ తర్వాత క్రమంగా తగ్గింది. చివరికి సదరు ఎమ్మెల్యే కూడా కరోనా చికిత్స కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చింది.
ఇప్పుడు మళ్లీ అదే ఎమ్మెల్యేకి కరోనా సోకిందన్న వార్తలు జనాల్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఆ వైసీపీ ఎమ్మెల్యే పేరు మహమ్మద్ ముస్తఫా. నియోజకవర్గం గుంటూరు తూర్పు. గతేడాది ముస్తఫాకు కరోనా సోకింది. అయినా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆయనతో పాటు అవే కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురికి కరోనా వ్యాపించింది. దీంతో వీరంతా వరుసగా ఆస్పత్రుల పాలయ్యారు. ఇప్పుడు మరోసారి ఆయనకు కరోనా సోకిందన్న వార్తలు ఆయన సహచరుల్ని కలవరపెడుతున్నాయి.
తాజాగా కరోనా లక్షణాలు కనిపించడంతో గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయనకు కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ఆయన క్వారంటైన్కు వెళ్లిపోయారు. ఆయనకు ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ అఁదుబాటులోకి రావడంతో డాక్టర్లు డోస్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ముస్తఫాతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.