రూ.1,000 కోట్ల ప్యాకేజీ ఆఫర్పై నోరు విప్పిన పవన్ కల్యాణ్- పార్టీని నడపలేం..!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు రూ.1,000 కోట్లు ఆఫర్ చేసినట్లు వచ్చిన వార్తలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారిగా స్పందించారు.
గుంటూరు: జనసేన పార్టీ.. ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమౌతోంది. ఈ నెల 14వ తేదీన మచిలీపట్నంలో ఆవిర్భావ సభను నిర్వహించనుంది. ఇది- జనసేన 10వ ఆవిర్భావ సభ. దీన్ని భారీ ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. అధినేత పవన్ కల్యాణ్ ఈ సభకు వారాహి వాహనంలో వేదిక వద్దకు చేరుకోనున్నారు. సభా వేదికకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారు. ఆవిర్భావ సభ పోస్టర్ కూడా ఆవిష్కరించారు.

మంగళగిరిలో పవన్ కల్యాణ్..
ఈ ఆవిర్భావ సభకు సన్నాహకంగా జనసేన పార్టీ- పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇదివరకే బీసీ నాయకులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ను నిర్వహించింది. పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొన్నారు. దీనికోసం శనివారమే ఆయన హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా మంగళగిరికి చేరుకున్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు.

కాపు సంక్షేమ సేన సమావేశంలో..
ఇవ్వాళ కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య దీనికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీ అజెండా కోసం తాము ఎప్పుడూ పని చేయబోమని స్పష్టం చేశారు. స్వతంత్ర భావాలు గల పార్టీగా జనసేన రాజకీయ కార్యకలాపాలు సుదీర్ఘకాలం పాటు కొనసాగుతాయని తేల్చి చెప్పారు.

రూ.1,000 కోట్లు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు 1,000 కోట్ల రూపాయల ప్యాకేజీని ఆఫర్ చేశారంటూ ఇదివరకు వచ్చిన వార్తలపై పవన్ కల్యాణ్ స్పందించారు. దీనిపై ఆయన మాట్లాడటం ఇదే తొలిసారి. 1,000 కోట్ల రూపాయలను తీసుకుని రాజకీయాలు చేయొచ్చంటే.. అంతకంటే హాస్యాస్పదం మరొకటి ఉండదని అన్నారు. వెయ్యి కోట్లు కాదు.. 10,000 కోట్ల రూపాయలు ఇచ్చిన రాజకీయాలు చేయలేమని, పార్టీని నడపలేమని ఆయన వివరించారు.

కాఫీలు, టీలు తాగడానికి..
డబ్బులు అనేవి కాఫీలు, టీలు తాగడానికి, ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లడానికి ఒక బండి అవసరం, అందులో ఇంధనం అవసరం కాబట్టి డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు. పార్టీని నడపడానికి కావాల్సింది భావనా బలం మాత్రమేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కాన్షీరాం డబ్బులు లేకుండా పార్టీని భావనాబలంతో నడిపించారని గుర్తు చేశారు. వామపక్ష భావజాలం ఉన్న ఉద్యమకారులు కూడా డబ్బులు లేకుండా పార్టీని నడిపించారని పేర్కొన్నారు.

జనసేన భావనాబలాన్ని నమ్ముకున్నా..
తాను జనసేన భావనాబలాన్ని నమ్ముకున్నానని, డబ్బులు లేకుండా రాజకీయం చేయలానేదే తన ఉద్దేశమని పవన్ కల్యాణ్ చెప్పారు. ఓటమికి తాను భయపడే వ్యక్తినే కాదని వ్యాఖ్యానించారు. ప్రతికూల పవనాల్లో తాను పార్టీని నడుపుతున్నానని వివరించారు. గాజువాక, భీమవరంలల్లో పోటీ చేయాలని తనను ఆహ్వానించారని, అయినా అక్కడ ఓడిపోయానని అన్నారు. ప్రతి కాపు కూడా తనకు ఓటు వేసి ఉంటే తాను ఓడిపోయే వాడిని కాదని అన్నారు.












Click it and Unblock the Notifications