ఇళ్లలోనే మద్యం! జగన్ గారూ మిమ్మల్ని ఉరితియ్యాలా?: లోకేష్ సంచలన వ్యాఖ్యలు
అమరావతి: ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేష్ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఇప్పటికే విమర్శలు చేస్తున్న ఆయన.. తాజాగా, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
అబ్బో ఏం విజన్?
‘@ysjagan గారి విజన్ నచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫ్రాన్స్ నుంచి పెట్టుబడుల బృందం ఒకటి వచ్చిందని సొంత మీడియాలో సొంత డబ్బా కొడుతుంటే తుగ్లక్ పాలనలో విజన్ ఏంటబ్బా అని ఆశ్చర్యపోయాం. తీరా ఆరాతీస్తే ఆ వచ్చిన వాళ్ళు fondationlouisvicat అనే సంస్థ ప్రతినిధులు' అని లోకేష్ వ్యాఖ్యానించారు. అంతేగాక, ‘ఆ సంస్థ గురించి తెలుసుకుంటే అసలు సంగతి బయటపడింది. ఆ సంస్థలో మన జగన్ గారి భారతి సిమెంట్ ఒక భాగస్వామి. అంటే వచ్చింది జగన్ గారి చుట్టాలే. మరో క్విడ్ ప్రో కో లాంటిదేదో ప్లాన్ చేస్తున్నారన్నమాట. అబ్బో ఏం విజన్!' అంటూ సెటైర్లు వేశారు లోకేష్.
సిగ్గు తెచ్చుకుంటారేమో..
‘25 ఎంపీలను ఇవ్వండి కేంద్రం మెడలు వంచుతా అన్న@ysjagan గారు, కేసుల మాఫీ కోసం నడుం వంచి ప్లీజ్ ప్లీజ్ అంటూ కాళ్ళు పట్టుకున్నారు. కానీ నడిచే ఆస్కారం లేని సామాన్య పౌరుడు ప్రసాద్ మాత్రం ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ట్రై సైకిల్ ర్యాలీ మొదలు పెట్టారు. మీ నిబద్ధతకు, ధృడ సంకల్పానికి జోహార్లు ప్రసాద్ గారు, మీ సైకిల్ ర్యాలీ త్వరగా పూర్తి అవ్వాలని కోరుకుంటున్నాను. మీ ర్యాలీ చూసి సిగ్గు తెచ్చుకుని, జగన్ గారి ప్రభుత్వం కేంద్రంపై పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని, వాల్తేరుతో కూడిన రైల్వే జోన్ సాధించాలని ఆశిద్దాం' అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
జగన్ గారూ ఉరితియ్యాలా??
‘మీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉందని అన్నందుకే అయ్యన్నపాత్రుడిగారి మీద మీరు కేసు పెడితే, ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రిని నడిరోడ్డుమీద కాల్చి చంపాలి అని అన్న మిమ్మల్ని ఏం చెయ్యాలి @ysjagan గారూ? ఉరి తియ్యాలా?' అని నారా లోకేష్ ధ్వజమెత్తారు.
జగనన్న సారా దుకాణాలు తెరుస్తున్నారంటూ..
పాదయాత్రలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, అధికారంలోకి వచ్చిన తరువాత ఇళ్ల మధ్యలోనే జగనన్న సారా దుకాణాలు తెరుస్తున్నారు. ఇంట్లో కాలేజ్ కి వెళ్లే అమ్మాయిలు ఉన్నారు, పిల్లలున్నారు, ఇక్కడ మద్యం దుకాణాలు వద్దు మహాప్రభో అని మహిళలు వేడుకుంటున్నా@ysjagan గారు కనికరించడం లేదు.
మహిళలను ఈడ్చి కొట్టిస్తారా?
‘ఇళ్ల మధ్యలో మద్యం దుకాణాలు వద్దు అని ఆందోళన చేసినందుకు మహిళలు అని కూడా చూడకుండా రోడ్డు మీదకు ఈడ్చి కొట్టిస్తారా? మద్యపాన నిషేధం పేరుతో మోసం చేసిన మిమల్ని మహిళలు నిషేధించడం ఖాయం జగన్ గారూ!' అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.