ప్రధాని మోడీ సౌత్ ఇండియా టూర్.. గుంటూరు పర్యటన గరం గరం.. బీజేపీ vs టీడీపీ
గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య బెడిసికొట్టింది. ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది పసుపు దండు వాదన. అలా క్రమక్రమంగా కమలం - సైకిల్ సవారీ బ్రేకులు తెగిపోయాయి. ఒకనాడు బీజేపీని అంటిపెట్టుకుని తిరిగిన టీడీపీ.. ప్రస్తుతం ఆ పార్టీని శత్రువులా పరిగణిస్తోంది. ఆ క్రమంలో మోడీ గుంటూరు పర్యటన ఆసక్తికరంగా మారింది. హీరో వస్తున్నాడంటూ బీజేపీ నేతలు ప్రచారం చేస్తుంటే.. గో బ్యాక్ అంటూ నిరసనలతో హోరెత్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులు. అదలావుంటే గుంటూరు పర్యటన తర్వాత తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు మోడీ.
మోడీ షెడ్యూల్ ఇదే..!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ మాట ఇచ్చి తప్పారనేది టీడీపీ వాదన. మొదట్లో బీజేపీతో సఖ్యంగా మెలిగిన టీడీపీ.. హోదా విషయంలో బీజేపీకి దూరంగా ఉంటోంది. అలా బీజేపీ - టీడీపీ ఎడబాటు తర్వాత మోడీ తొలిసారిగా ఏపీ పర్యటనకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉదయం 10 గంటల 45 నిమిషాలకు ప్రత్యేక విమానంలో విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు మోడీ. అక్కడినుంచి హెలికాప్టర్లో 11 గంటల 5 నిమిషాలకు గుంటూరుకు వెళ్తారు. 11 గంటల 15 నిమిషాలకు ఏటుకూరు బైపాస్ రోడ్డు దగ్గరకు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పథకాలను ప్రారంభించనున్నారు. అక్కడి బహిరంగసభలో కొద్దిసేపు మాత్రమే ప్రాజెక్టులపై ప్రసంగించనున్నారు.
పబ్లిక్ మీటింగ్ అనంతరం అక్కడినుంచి 11 గంటల 25 నిమిషాలకు బయలుదేరి..11 గంటల 30 నిమిషాలకు గుంటూరుకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం 12 గంటల 25 నిమిషాల వరకు హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడినుంచి 12 గంటల 30 నిమిషాలకు హెలికాప్టర్లో బయలుదేరి 12 గంటల 50 నిమిషాలకు విజయవాడ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు తమిళనాడులోని తిరుప్పూర్ సమీపంలోని పెరుమానళ్లూరు గ్రామంలో జరిగే పబ్లిక్ మీటింగ్ కు హాజరవుతారు. సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు కర్ణాటకలోని రాయచూర్ సమీపంలోని గబ్బూరు విలేజ్ లో జరగనున్న బహిరంగ సభకు వెళతారు.
హీరో కమింగ్.. ! బాబు సినిమా క్లైమాక్స్
మోడీ పర్యటనను టీడీపీ వ్యతిరేకిస్తుండటంతో స్థానిక బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. హీరో మోడీ ఏపీలో ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ వ్యాఖ్యానించారు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు. ఆంధ్రలో చంద్రబాబు నాయుడు సినిమా క్లైమాక్స్ చేరిందని ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా టీడీపీ నేతల తీరును తప్పుపట్టారు. అమరావతి నిర్మాణానికి మోడీ లక్ష కోట్లు ఇస్తానంటూ చెప్పలేదని గుర్తుచేశారు.
బీజేపీ వర్సెస్ టీడీపీ, లెఫ్ట్, కాంగ్రెస్
మోడీ రాక, టీడీపీ నేతల నిరసనతో ఏపీలో ఉత్కంఠభరితమైన వాతావరణం నెలకొంది. మోడీ గో బ్యాక్ ఆందోళనల పర్వం టీడీపీ, బీజేపీ మధ్య వేడి రాజేస్తోంది. గన్నవరం ఎయిర్ పోర్టు మొదలు గుంటూరు రహదారిపై మోడీకి వ్యతిరేకంగా హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. అటు వామపక్ష నేతలు, కాంగ్రెస్ లీడర్లు సైతం మోడీ రాకను వ్యతిరేకిస్తున్నారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మోడీపై ఓ రేంజ్ లో ఫైరవుతున్నారు. ఇక్కడి ప్రజల న్యాయమైన కోరికలు తీర్చాకే అడుగుపెట్టాలంటూ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘువీరా రెడ్డి బీజేపీపై ఆరోపణాస్త్రాలు గుప్పించారు. వైసీపీతో లాలూచీ పడి మోడీ సభకు జనాన్ని తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు ఏపీకి న్యాయం చేయకుండా ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రశ్నించారు సీపీఐ నేత సురవరం. అదలావుంటే బీజేపీతో ఇన్నేళ్లు అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడేమో మోడీ పర్యటన అడ్డుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు . మోడీని అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఆరోపించారు.