బాలకృష్ణకు చేదు అనుభవం.. సీమ సింహం కాదు.. సీమద్రోహి అంటూ హిందూపూర్లో..
Recommended Video
నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు సొంత నియోజకవర్గం హిందూపూర్ లో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. రెండ్రోజుల పర్యటన కోసం గురువారం హిందూపూర్ వచ్చిన ఆయనను స్థానిక వైసీపీ కార్యకర్తలు, ప్రజలు అడ్డుకున్నారు. నిరసనకారులు కాన్వాయ్ కి అడ్డంగా దూసుకురావడంతో వారిని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడికి భారీగా చేరుకున్న టీడీపీ కార్యకర్తలు.. జైబాలయ్య నినాదాలు చేస్తూ ప్రత్యర్థులవైపుకు వెళ్లబోయారు.

ద్రోహులను రానివ్వం..
జగన్ సర్కారు తలపెట్టిన మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియకు అడ్డుపడుతోన్న బాలకృష్ణ.. రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. ‘‘సీమద్రోహి బాలయ్య గోబ్యాక్'' అంటూ నినాదాలు చేశారు. ‘‘ఆయన చేసిన సినిమాల వల్ల కొందరు బాలయ్యను సీమసింహం అంటారు.. కానీ వాస్తవంగా ఆయన సీమసింహం కాదు.. సీమద్రోహి. రాయలసీమ అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారు''అని స్థానిక వైసీపీ నేతలు విమర్శించారు.

పోలీసులు అక్కడే ఉన్నా..
గురు, శుక్రవారాల్లో బాలయ్య హిందూపూర్ నియోజకవర్గంలో పర్యటించనుండటంలో ఎక్కడిక్కడే నిరసనలు తెలపాలని వైసీపీ నేతలు ముందుగానే సిద్ధమయ్యారు. బాలయ్య కాన్వాయ్ వచ్చే రూట్ లో ప్లాకార్డులు, బ్యానర్లలో రోడ్డుకు అడ్డంగా బైఠాయించారు. అక్కడే ఉన్న పోలీసులు.. నిరసనకారులకు ఎంత నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరికి బాలయ్య కాన్వాయ్ దగ్గరికి సమీపించడంతో అందరినీ ఈడ్చిపారేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.

పోటాపోటీ నినాదాలు..
వైసీపీ కార్యకర్తలు బాలయ్య వాహనాన్ని అడ్డుకోబోతున్న సమాచారంతో టీడీపీ నేతలు పెద్ద సంఖ్యలో రామాంతపూర్ సర్కిల్ దగ్గరికి చేరుకున్నారు. కాన్వాయ్ కి భద్రతగా కదులుతూ జై బాలయ్య నినాదాలు చేశారు. అటు గో బ్యాక్ బాలయ్య.. ఇటు జై బాలయ్య నినాదాలతో హిందూపూర్ హోరెత్తింది. ఇలాంటి విషయాల్లో వెంటనే స్పందించే బాలకృష్ణ ఇవాళ మాత్రం కారులో నుంచి బయటికి రాలేదు. ఈ రెండు రోజులూ ఎమ్మెల్యేకు అదనపు సెక్యూరిటీ కల్పించే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications