"సురభి" నవరసాల తోరణం... ఆకలి ప్రస్థానం...!
మైమరపించే దృశ్యాలు... అబ్బురపరిచే సన్నివేశాలు... నవరసాలను అవలీలగా పలికిస్తూ... ప్రేక్షకులను సమ్మోహితులను చేసే అభినయతారలు... సురభి నట వారసులు. తోలుబొమ్మలాటతో ప్రారంభమైన వారి ప్రస్థానానం... 135 ఏళ్లలో అంచెలంచెలుగా ఎదిగి... నాటక ప్రదర్శనలు మొదలుకుని ఎన్నో కళలకు శ్రీకారం చుట్టింది. తెలుగు వెండితెరకు పురుడుపోసిన ఈ ప్రాచీన కళ... మరెన్నో ఆటుపోట్లను ఎదుర్కొని... నేటికీ సురభి వారసుల కళాతృష్ణకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.
కాల క్రమంలో నాటక ప్రదర్శనలకు ఆదరణ తగ్గినా... కళారంగంలో, కళారాధకుల హృదయాల్లోనూ... సురభి కుటుంబ సభ్యులకు ప్రత్యేక స్థానం నెలకొని ఉంది. ఇప్పటికీ వీరు వేసే నాటకాలకు జనాదరణ తగ్గలేదు అనడంలో అతిశయోక్తి లేదు.ఒకానొక సమయంలో రాజమర్యాదలు అందుకున్న సురభి నట వారసులు క్రమంగా తమ కళకు ఆదరణ తగ్గినా... తాము నమ్ముకున్న కుల వృత్తిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రస్తుతం రంగారెడ్డి పరిధిలోని శేరిలింగంపల్లి వద్ద నివసిస్తున్న 8వ తరం సురభి వారసులు... ఇప్పటికీ తమ కళను కాపాడుకుంటూనే ఉన్నారు.
కరోనా లాక్ డౌన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... మొండిధైర్యంతో ముందడుగు వేసిన కళామతల్లి ముద్దుబిడ్డలు... ఆన్ లైన్ వీడియో కాల్స్ ద్వారా దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇస్తూ తమ కళను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కళను అయితే కాపాడుకుంటున్నారు కానీ, కాలే కడుపుల మాటేమిటన్నది ఎవరికీ అందని ప్రశ్నగా మిగిలిపోయింది.
ఎక్కడో కడప జిల్లాలోని సురభి అనే మారుమూల గ్రామంలో 1885లో కీచక వధ అనే నాటక ప్రదర్శనతో సురభి నాటక సమాజం ఏర్పడింది. ఈసమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. 1885లో వనారస సోదరులు వనారస గోవిందరావు, వనారస చిన్నరామయ్య కలిసి కడప జిల్లా చక్రాయపేట మండలములోని సురభి రెడ్డివారిపల్లెలో శ్రీ శారదా వినోదిని నాటక సభను ప్రారంభించారు. సురభిలో ప్రారంభమైన ఈ నాటక సభ కాలక్రమేణ సురభి నాటక సంఘముగా ప్రసిద్ధి చెందింది. రంగస్థలముపై స్త్రీ పాత్రలను స్త్రీలచే ధరింపచేసిన తొలి నాటక బృందము సురభినే. నాటకంలోని పాత్రధారులందరూ ఒకే కుటుంబంలోని సభ్యులవడము చేత స్త్రీలకు చెడ్డపేరు వస్తుందనే భయము ఉండేది కాదు. బృందములోని సభ్యులకు రంగస్థలమే జీవితముగా సాగేది.
ఇక ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాదు నగర శివారులోని శేరిలింగంపల్లిలో 240 కుటుంబాలకు ఆశ్రయం కల్పించారు. ఒక్కో కుటుంబానికి 140 గజాల ఇళ్ల స్థలాన్ని కేటాయించారు. ఈ కాలనీ పేరును సురభి కాలనీగా మార్చుకుని ఇక్కడే ఒక స్టేజీ ఏర్పాటు చేసుకుని నాటకాల ప్రదర్శన ఇస్తున్నారు. ఇక కాలక్రమంలో నాటకాలకు ఆసక్తి తగ్గడంతో వీరు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ చాలిచాలని జీతంతో బతుకుబండిని లాగుతున్నారు. బయట ఉద్యోగాలు చేస్తూనే వారి వృత్తిని మాత్రం మరవలేదు. పండగలు, ఇతరత్ర ప్రత్యేక సందర్భాలు వచ్చిన సమయంలో ఎవరైనా అవకాశం ఇస్తే ఒక బృందంగా వెళ్లి అక్కడ నాటకాలను ప్రదర్శిస్తారు. ఇక నాటకం సందర్భంగా ఏదైనా విషాదం జరిగి చనిపోతే, మృతదేహాన్ని స్టేజీ వెనకే ఉంచి నాటకాన్ని బాధతోనే ప్రదర్శించిన రోజులు కూడా ఉన్నాయని చెబుతూ కళాకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అన్ని రాష్ట్రాల్లోని ఊర్లు తిరుగుతూ నాటకాలను ప్రదర్శిస్తూ జీవితం కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సురభి సంస్థ ఇప్పుడు కళతో పాటు తమ బ్రతుకులు కూడా బాగుపడేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కళాకారులు వేడుకుంటున్నారు.