Balkampeta Ellamma: బల్కంపేట ఎల్లమ్మకు కిరీటం.. 2.20 కిలోల బంగారంతో తయారీ..
బల్కంపేట ఎల్లమ్మ ఎల్లమ్మ కల్యాణోత్సవ తేదీని ప్రకటించారు. జూన్ 20న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆలయాన్ని మహా పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. గురువారం అమ్మవారి ఆలయంలో పూజా సామాగ్రి దుకాణాలను మంత్రి ప్రారంభించారు.
ఆలయం వద్ద దాతల సహకారంతో నిర్మించిన 34 షాపులను ప్రారంభించారు. ఎల్లమ్మ కళ్యాణోత్సవ ఏర్పాట్లపై మే 10న అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. కుల మత, రాజకీయాలకు అతీతంగా.. ఎల్లమ్మ దేవాలయ అభివృద్ధిలో అందరి సహకారంతో ముందుకు వెళ్లాలని చెప్పారు. భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న బంగారంతో అమ్మవారికి ఆభరణాలు చేయిస్తున్నామని తెలిపారు. ఇలా 2.20 కిలోల బంగారంతో కిరీటం, ఇతర ఆభరణాలు తయారయ్యాయని మంత్రి తలసాని తెలిపారు.

కల్యాణోత్సవం సందర్భంగా అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా సకల వసతులు కల్పిస్తామని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆలయాలు ఎంతో అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. బల్కంపేట ఆలయానికి వచ్చే వేలాది మంది భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయానికి దాదాపు 700 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్ నగరం ఏర్పడకముందు బల్కంపేట చుట్టూ పొలాలతో ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతితో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించినా, కదలకపోవడంతో ఊళ్లోకెళ్లి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయీ వేసినా కదలలేదు. విగ్రహాన్ని అక్కడే ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications