విషాదం : కరోనా భయంతో... వృద్ద దంపతుల ఆత్మహత్య...
కరోనా పట్ల నిర్లక్ష్యం,అపోహ రెండూ ప్రమాదకరమే. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం,చికిత్స పొందడం చేయాలి. అంతే తప్ప నిర్లక్ష్యంగా వ్యవహరించినా.. లేక అపోహలతో ఎక్కువగా ఆందోళన చెందినా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా హైదరాబాద్లో ఓ వృద్ద దంపతులు కరోనా సోకిందేమోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.
వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్లోని ఖైరాతాబాద్లో ఉన్న రాజీనగర్లో ఎడమ వెంకటేశ్వరరావు(63),వెంకటలక్ష్మి(60) అనే వృద్ద దంపతులు నివసిస్తున్నారు. గత 10 రోజులుగా వీరు దగ్గు,జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కరోనా సోకిందేమోనని ఇద్దరూ భయాందోళనకు గురయ్యారు. ఇదే క్రమంలో శనివారం(అగస్టు 1) ఇంట్లోనే కూల్ డ్రింక్లో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సూసైడ్ నోట్లో ఈ వివరాలను పేర్కొనట్లు సమాచారం.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే అనవసర భయాందోళనకు గురికాకుండా ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వాలు పదేపదే చెప్తున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొంతమంది అపోహలతో,ఆందోళనతో ప్రాణం తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో కరోనా భయంతో పలువురు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు చాలానే వెలుగుచూశాయి.












Click it and Unblock the Notifications