TSRTC Strike:ప్రైవేటీకరిస్తాం.. అమ్మేస్తాం..: కేసీఆర్ బెదిరింపులకు ‘కేంద్రం’ ఉందన్న అశ్వత్థామరెడ్డి
హైదరాబాద్: ఆర్టీసీ సమ్మె విషయంలో అటు కార్మిక యూనియన్లు గానీ, ఇటు ప్రభుత్వం గానీ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో అరకొర బస్సులతో ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఓ వైపు ప్రైవేటు బస్సులు కొన్ని ఆర్టీసీ కంటే ఎక్కువగా ఛార్జీలు వసూలు చేస్తున్నా.. చేసేదేం లేక ప్రజలు తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు ఆ మొత్తం చెల్లించక తప్పడం లేదు.
సోమవారం సాయంత్రం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నవంబర్ 5 లోగా కార్మికులు విధుల్లో చేరితే వారికి రక్షణ కల్పిస్తామని.. కార్మికులు చేరకపోతే మాత్రం తెలంగాణలో ఇక ఆర్టీసీ అనేది ఉండదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మాట్లాడుతూ.. సమ్మె విరమించేది లేదని స్పస్టం చేశారు.

కేసీఆర్ ఎన్ని బెదిరింపులకు దిగినా..
నెల రోజులకుపైగా సమ్మె కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ పెట్టిన డెడ్ లైన్ ఈరోజుతో ముగియనుండటంతో జేఏసీ నేతలు బుధవారం కీలక భేటీ నిర్వహించారు. ఈ భేటీలో జేఏసీ నేతలతోపాటు రాజకీయ పార్టీలు, సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలతో ఈ అంశంపై చర్చించారు. ప్రభుత్వం ఎన్ని బెదిరింపులకు గురిచేసినా కార్మికులు చెక్కు చెదరడం లేదని అశ్వత్థామ రెడ్డి చెప్పారు.

కేంద్రం అనుమతి లేకుండానా?
ఇదే పోరాటపటిమ తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకూ కొనసాగుతుందని ఆయన స్పస్టం చేశారు. తమ డిమాండ్లను చర్చల ద్వారా పరిష్కరించేంత వరకు కార్మికులంతా సమ్మెను కొనసాగిస్తారని అశ్వత్థామ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉందని, ఎలాంటి మార్పులు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే చేయాల్సి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రోజుకోసారి ఆర్టీసీని ప్రైవేటీకరిస్తాం.. రూట్లు అమ్మేస్తాం.. అనడం ముఖ్యమంత్రికి సరికాదని అశ్వత్థామ రెడ్డి అన్నారు. ఆర్టీసీని తీసేయాలంటే కేంద్రం అనుమతి తప్పనిసరి ఉండాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి ఏదైనా సవరణ చేయాల్సి ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికులెవరూ భయపడాల్సిన అవసరం లేదని అశ్వత్థామ రెడ్డి భరోసా కల్పించారు.

చర్చలకు పిలవకుండా బెదిరింపులా...?
చర్చల ద్వారా పరిష్కారించాలనేదే తమ డిమాండ్ అని.. ఏదైనా సమస్య పరిష్కారానికి ఇబ్బంది ఉంటే కూర్చుని మాట్లాడుకుందామని, చర్చలకు పిలువకుండా బెదిరింపులకు పాల్పడటం సరికాదని అన్నారు అశ్వత్థామ రెడ్డి. స్వయంగా మంత్రులే వచ్చి డిపోల వద్ద తమ బంధువులను విధుల్లో చేరాలని కోరినా కార్మికులు ఎక్కడా చెక్కు చెదరలేదని చెప్పారు.

వారంతా వెనక్కి వచ్చేశారు..
ఇప్పటి వరకు తెలంగాణ బోర్డు ఏర్పాటు కాలేదని అన్నారు. కార్మికులు ఎవరూ ఎక్కడా విధుల్లో చేరలేదని, నిన్న, మొన్న వెళ్లినవారిలో కూడా చాలా మంది వెనక్కి వచ్చేశారని చెప్పారు. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి చర్చలతోనే పరిష్కరించాలన్నారు. 20 మందికిపైగా కార్మికులు చనిపోతే ఏ ఒక్క అధికారి కూడా సానుభూతి తెలపలేదన్నారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా చెప్పలేదన్నారు. బైంసాలో ఆర్టీసీ డిపో మేనేజర్పై జరిగిన దాడిని తాము ఖండించామని తెలిపారు.












Click it and Unblock the Notifications