బీజేపీలోకి బండ కార్తీక..? ముహూర్తం ఖరారు.. మేయర్ అభ్యర్థి మహిళ కావడంతో ప్రాధాన్యం..
గ్రేటర్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడింది. దీంతో అభ్యర్థులు/ నేతలు టికెట్లు, పార్టీ మార్పుపై ఫోకస్ చేశారు. పార్టీ నుంచి పోటీ చేస్తే తగిన ప్రాధాన్యం వస్తోందా..? మేయర్, డిప్యూటీ మేయర్ లాంటి పదవులు వరిస్తాయా అనే లెక్కలు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్- బీజేపీల మధ్య నేతలు వలసలు కొనసాగనున్నాయి. ఇటు కాంగ్రెస్ నుంచి కూడా కొందరు నేతలు పార్టీ మారాలని అనుకుంటున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే మాజీమేయర్ బండ కార్తీకరెడ్డి పేరు తెరపైకి వచ్చింది.
దూరం.. దూరంగా..
బండ కార్తీక కాంగ్రెస్ పార్టీలో ఉన్నా.. అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కార్తీకతో సమావేశమయ్యారు. అయితే ఆ సమయంలో పార్టీలోకి రావాలని కోరినా.. ఆమె స్పందించలేదు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం ఎమ్మెల్సీ రాంచందర్ రావు కార్తీకను మీట్ అయ్యారు. పార్టీలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. తర్వాత ఆర్ఎస్ఎస్ నేతలు కూడా కార్తీకతో సంప్రదింపులు జరిపారు. దీంతో కార్తీక బీజేపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ముహూర్తం కుదిరేనా..?
అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెల 19వ తేదీన కార్తీక బీజేపీలో చేరతారు. ఇటు పీసీసీ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ నెల 22 లేదంటే 23వ తేదీన బీజేపీ కండువా కప్పుకునే అవకాశం ఉంది. మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహిత అనుచరుడు కొప్పుల నర్సింహారెడ్డి సోమవారం బీజేపీలో చేరారు. మరికొందరు కూడా క్యూ కట్టినట్లు తెలిసింది.
మహిళకే మేయర్ పదవీ
అయితే ఈ సారి మేయర్ పీఠం మహిళకు కేటాయించారు. జనరల్ మహిళకు ఖరారు చేయడంతో.. ఆయా పార్టీల నుంచి బలమైన నేతలే మేయర్ పదవీ వరిస్తోంది. ఇప్పటికే మేయర్ పదవీ చేపట్టిన బండ కార్తీక మరోసారి చేపడుతారా..? అందుకోసం బీజేపీలో చేరుతున్నారా అనే చర్చ జరుగుతోంది. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఆమె బీజేపీలో చేరడంతో తెలిసిపోతోంది. ఇటు కార్తీక మాత్రం సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని భావించినా.. కాంగ్రెస్ హై కమాండ్ టికెట్ ఇవ్వలేదు. దీంతో పార్టీ కార్యకలాపాలకూ దూరం దూరంగా ఉంటూ వస్తున్నారు.
మరిన్ని వలసలు..
అధికార టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి మరిన్ని వలసలు ఉంటాయని తెలుస్తోంది. మల్కాజ్గిరి, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లోని కొందరు అసంతృప్త నేతలు బీజేపీతో టచ్లో ఉన్నట్టు సమాచారం. కొత్తగా టికెట్లు ఆశిస్తున్న వారు, పాత వాళ్లకే మరోసారి చాన్స్ ఇస్తే జంప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటివారు బీజేపీతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Recommended Video
దుబ్బాక ఫలితం..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అనూహ్యంగా బీజేపీ విజయ దుందుబి మోగించడంతో.. టీఆర్ఎస్ పార్టీ ఆత్మపరిశీలనలో పడింది. బల్దియా ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలని భావిస్తోంది. అందుకోసమే షెడ్యూల్ లోపు ఎన్నికలు నిర్వహణకు ఏర్పాట్లు కూడా చేసింది. బల్దియాలో విజయం సాధించి.. ప్రత్యర్థులకు గుణపాఠం చెప్పాలని అనుకుంటోంది. కానీ బీజేపీ కూడా ఇదే ధీమాతో ముందడుగు వేస్తోంది. మరీ ప్రజలు ఏ వైపు నిలుస్తారో చూడాలీ మరీ.