మహిళలకు రక్షణేది? అధికార పార్టీ నేతల వేధింపులే ఎక్కువ: డీకే అరుణ, బండి సంజయ్
తెలంగాణలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.
హైదరాబాద్: తెలంగాణలో మహిళలపై వేధింపులు పెరుగుతున్నా.. కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. బీఆర్ఎస్ మహిళా ప్రజాతిప్రతినిధులకు ఆ పార్టీ పురుష నేతల నుంచే వేధింపులు ఎదురవడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణలో మహిళలపై జరుగుతున్న హత్యలు, అత్యాచారాలను నిరసిస్తూ శుక్రవారం బీజేపీ కార్యాలయంలో చేపట్టిన మహిళా గోస-బీజేపీ భరోసా దీక్ష ముగింపు సందర్భంగా డీకే అరుణ మాట్లాడారు.

మహిళలకు రక్షణేది అంటూ ప్రశ్నించిన డీకే అరుణ
బీఆర్ఎస్లో మహిళా ప్రజాప్రతినిధులు సొంతంగా నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదన్నారు డీకే అరుణ. రాష్ట్ర రాజకీయాల్లో తన కుమార్తె తప్ప ఎవరూ కనపడకూడదనే కేసీఆర్ ఉద్దేశమన్నారు. జగిత్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేధించాడని భోరున ఏడ్చినా.. కేసీఆర్ ఇప్పటి వరకు స్పందించలేదన్నారు. సీఎం కేసీఆర్ కు మహిళలంటే చిన్నచూపని ఆరోపించారు. బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం లేదన్నారు. హన్మకొండ జిల్లా జానకిపురం సర్పంచ్ నవ్య స్థానిక ప్రజాప్రతినిధి తనను వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసిన సంఘటనే ఇందుకు ఉదాహరణ అని డీకే అరుణ చెప్పారు. ప్రీతి ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ స్పందించలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నేతల వేధింపులే ఎక్కువయ్యాయన్న డీకే అరుణ
మహిళలపై జరుగుతున్న ఘటనల్లో బీఆర్ఎస్ నేతలు, వారి పిల్లల ప్రమేయం ఉంటుందని అరుణ మండిపడ్డారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 4 సీట్లే మహిళలకు ఇచ్చారన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టాలని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేసిన కవిత.. తెలంగాణ మంత్రివర్గంలోకి మహిళలను ఎందుకు తీసుకోవడం లేదని.. తన తండ్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు.
అధికారం శాశ్వతం కాదంటూ కేటీఆర్పై డీకే అరుణ ఫైర్
కవితకు ఈడీ నోటీసులు ఇస్తే.. ఢిల్లీలో ధర్నా చేపడతానన్నందుకే నోటీసులు ఇచ్చారని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో ప్రమేయం లేకపోతే భయం ఎందుకని డీకే అరుణ ప్రశ్నించారు. సానుభూతి కోసమే డ్రామాలాడుతున్నారన్నారు. అధికారం శాశ్వతం కాదని మంత్రి కేటీఆర్కు డీకే అరుణ హితవు పలికారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేకే ప్రధానిపైన, కేంద్రంపైనా అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. లిక్కర్ స్కాంపై కాంగ్రెస్ నేతలు ఒక్క మాటా మాట్లాడటం లేదన్నారు. కవిత మాత్రం సోనియా గాంధీని పొగుడుతుంటే.. ధర్నాకు పోకుండా కాంగ్రెస్ డ్రామాలాడుతోందన్నారు.
తెలంగాణలో మహిళలకు ప్రాధాన్యత ఏది అంటూ బండి సంజయ్
మరోవైపు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలో కాదు.. ప్రగతి భవన్ ముందు ధర్నా చేయాలన్నారు.
లిక్కర్ కేసు నుంచి తప్పించుకునేందుకే కవిత ఢిల్లీలో దీక్ష చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే మహిళలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం తీరుతో నే రాష్ట్రంలో మహిళలై వరుస ఘటనలు జరుగుతున్నాయన్నారు. మొదట రాష్ట్రంలో 33 శాతం మహిళ రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్ మీటింగ్లో మహిళలపై ఎందుకు మాట్లాడ లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. మహిళా హక్కుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని విమర్శించారు. మద్యం రేట్లు పెంచిందే కవిత కోసమని ఆరోపించారు. 40 వేల కోట్ల ఆదాయం లిక్కర్ ద్వారా రాష్ట్రానికి వస్తోందన్నారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ నెంబర్ 2 గా ఉందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న మహిళల దాడులపై సర్కార్ పట్టించుకోలేదని అన్నారు. మోడీ సర్కార్ లో 8 మంది మహిళలు మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications