బండి పాదయాత్రకు ఎన్నికల కోడ్ ఇబ్బందులు.. బహిరంగ సభపై అనుమానాలు..?
హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాజకీయ పరిణామాలు చకచక మారిపోతున్నాయి. బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్కు కొత్త చిక్కు వచ్చి పడింది. షెడ్యూల్ విడుదల కావడంతో.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలో పాదయాత్రకు బ్రేక్ పడినట్టే అయ్యింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు ఎన్నికల కోడ్ కష్టాలు వచ్చాయి. హుజూరాబాద్ ఎన్నికల కోడ్ నిబంధనలతో ఇబ్బందులు తప్పడం లేవు. గతంలో ఎన్నడూలేని విధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ కఠిన నిబంధనలు విధించింది. ఎన్నికలు జరిగే నియోజకవర్గంలో ఎలాంటి బహిరంగ సభలు నిర్వహించొద్దని నిబంధన విధించింది. అక్టోబర్ 2న హుజూరాబాద్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలతో సభకు ఆటంకాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 500కు మించి జనసమీకరణ ఉండకూడదని ఈసీ ఆంక్షలు విధించింది. సంజయ్ వెంటరోజు పాదయాత్రకు వందలాది మంది కార్యకర్తలు హాజరవుతున్నారు. బయట నుంచి వాహనాలు వస్తే సీజ్ చేస్తామని ఎన్నికల సంఘం అంటోంది. దీంతో పాదయాత్ర ఎలా అనే చర్చ వచ్చింది.
బండి సంజయ్ పాదయాత్ర బుధవారం సిద్దిపేటలో ముగియనుంది. గురువారం ఉదయం కరీంనగర్ నగర్లో ప్రవేశించనున్నారు. హుజూరాబాద్కు వేళ్ళె పరిస్థితి లేకపోవడంతో పాదయాత్ర రూట్ మ్యాప్ ఎలా ఉండాలనే అంశంపై చర్చ జరుగుతోంది. హుజూరాబాద్కు వెళ్ళకుండా హుస్నాబాద్కు వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నారు. పాదయాత్ర మొదటి విడత ముగింపు సభ భారీ జనసమీకరణతో చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అక్టోబర్ 2న సభ నిర్వహించి తీరాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం కరీంనగర్ జిల్లాకు సమీపంలో ఉన్న ప్రాంతంలోనే సభకు ప్లాన్ చేస్తున్నారు. ఏ విధంగా ముందుకువెళతారో మరీ.
హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. అక్టోబర్ 30న ఈ రెండు నియోజక వర్గాలకు ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడించింది. నవంబర్ 2న కౌంటింగ్ చేపట్టనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. అక్టోబర్ 8వరకు నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించారు. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13గా ప్రకటించింది. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల నిర్వహించి, నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను ప్రకటిస్తారు.ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారికంగా షెడ్యూల్ను విడుదల చేసింది.