కవితకు ఈడీ నోటీసులపై స్పందించిన కేసీఆర్: ఏమన్నారంటే?
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా స్పందించారు.
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోందని అన్నారు.
కవితను అరెస్టు చేస్తారట.. చేయనివ్వండి. ఏం చేస్తారో చూద్దాం. భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు.
రాష్ట్ర మంత్రులు, ఎంపీలతోపాటు కవిత వరకు వచ్చారని కేసీఆర్ వ్యాఖ్యానించారు. కవితకు నోటీసులు ఇచ్చారు.. ఏం చేస్తారో చూద్దామని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య, న్యాయబద్ధంగానే ఎదుర్కొందామని తెలిపారు. బీజేపీని ఇంటికి పంపడంలో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించాల్సి ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

99 శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. శాసనసభ్యులు తప్పులు చేయవద్దని సూచించారు. తప్పు చేసినవారికి టికెట్లు దక్కవని కేసీఆర్ తేల్చి చెప్పారు. శుక్రవారం తెలంగాణ భవన్లో శుక్రవారం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగిన విషయం తెలిసిందే.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు అంశాలపై పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులతో అన్నారు. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయన్నారు. పాదయాత్రలు, కార్యకర్తలు సమావేశాలు నిర్వహించాలని, నేతలంతా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కేసీఆర్ సూచించారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులు ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె శనివారం ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరుకానున్నారు. మరోవైపు, ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీ వేదికగా కవిత నిరాహార దీక్ష చేపట్టారు.












Click it and Unblock the Notifications