దళితులతో కేసీఆర్ మాటామంతీ: దళితబంధు పథకంపై ప్రగతిభవన్లో చర్చ
దళిత బంధుపై తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికతో ముందుకెళుతుంది. దళితుల సామాజికాభివృద్ధిపై సీఎం కేసీఆర్ దృష్టిసారించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం అయ్యే ఈ పథకంపై తొలి అవగాహన సదస్సు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో జరగనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు సమావేశం నిర్వహిస్తారు.
తెలంగాణ దళిత బంధు పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై అవగాహన కల్పిస్తారు. సమావేశానికి హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామానికి నలుగురు చొప్పున దళితులు పాల్గొంటారు. ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు పాల్గొంటారు. వారితో పాటు 15 మంది రిసోర్స్ పర్సన్స్ పాల్గొంటారు.
Recommended Video
హుజూరాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చిన దళితులు.. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులు ఆర్పిస్తారు. దళితబంధు పథకంలోని ముఖ్య అంశాలపై చర్చించి.. సూచనలు చేస్తారు. పథకం విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ వారికి అవగాహన కల్పిస్తారు. దళితబంధు పథకం రాష్ట్రంలోని దళితులు అందరి జీవితాల్లో గుణాత్మక మార్పుకు ఏ విధంగా దోహదపడుతుందో అనే అంశంపై క్లారిటీ ఇస్తారు.
అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి.. ఎలా ముందుకెళ్లాలి.. అనే అంశాలను ఇంటరాక్షన్ సెషన్లో సీఎం కేసీఆర్ వారికి వివరిస్తారు. దళిత బంధు పథకం కోసం ఎంతయినా ఖర్చు పెడతామని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఎన్నికల కోసమే ఈ పథకం అనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. కానీ ఎన్నికల స్టంటేనని విపక్షాలు అంటున్నాయి.