కరోనా కాటు: అమిత్ షా హైదరాబాద్ పర్యటన..బహిరంగ సభ నిరవధిక వాయిదా.. !
హైదరాబాద్: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనపై కరోనా వైరస్ దెబ్బ పడింది. హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అమిత్ షా పర్యటనను వాయిదా వేశారు. మళ్లీ ఎప్పుడు ఈ పర్యటన ఉంటుందనే విషయాన్ని ఇంకా వెల్లడించాల్సి ఉంది. హైదరాబాద్లో కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నందునే అమిత్ షా పర్యటనను వాయిదా వేసినట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్రశాఖ నాయకులు వెల్లడించారు.
ప్రాణాంతక కరోనా వైరస్ ప్రభావానికి గురైంది తెలంగాణ. హైదరాబాద్ సహా కొన్ని జిల్లాల్లో వైరస్ లక్షణాలు వెలుగు చూశాయి. ఈ మహమ్మారి బారిన పడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరుతున్న అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. మరోవంక- గచ్చీబౌలి, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో గల సాఫ్ట్వేర్ కార్యాలయాలు, ఐటీ పార్కుల్లో సైతం అనధికారికంగా సెలవులను ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశాన్ని కల్పించారు. ఇలాంటి పరిస్థితుల మధ్య అమిత్ షా పర్యటనను నిర్వహించడం సబబు కాదని భావించారు.

నిజానికి- ముందే నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించాల్సి ఉంది బీజేపీ. దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా ఈ సభ, ప్రదర్శనను నిర్వహించ తలపెట్టారు. దీనికి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉంది. పౌరసత్వ సవరణ చట్టం ఉపయోగాలను వివరించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉద్దేశించిన ర్యాలీలను ఆయన లాంఛనంగా ప్రారంభించాల్సి ఉంది.
ప్రస్తుతం హైదరాబాద్లో నెలకొన్న పరిస్థితులు, ఆందోళనకర వాతావరణం నేపథ్యంలో అమిత్ షా పర్యటనను వాయిదా వేయడమే మంచిదని నిర్ణయించారు. నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. మళ్లీ ఎప్పుడు ఈ సభను గానీ, ర్యాలీని గానీ నిర్వహిస్తారనే విషయాన్ని ఇప్పటికిప్పుడు వెల్లడించలేమని అన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాతే.. దీనిపై తాజా నిర్ణయాన్ని తీసుకుంటామని, కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications