షాకింగ్ : ఉస్మానియాలో వైద్యులపై కరోనా అనుమానితుడి తండ్రి దాడి..
ఇటీవల సికింద్రాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో వైద్యులపై కరోనా పేషెంట్ దాడి ఘటన మరువకముందే ఉస్మానియా ఆసుపత్రిలో మరో దాడి ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ పేషెంట్లను కూడా అనుమానితుల వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారన్న ఆరోపణలతో ఓ కరోనా అనుమానితుడి తండ్రి ఇద్దరు పీజీ డాక్టర్లపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. కరోనా అనుమానితుల్లో తాజాగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. అయితే వారి రిపోర్ట్స్ వచ్చేంతవరకు ఆగాలని వైద్యులు సూచించగా.. పాజిటివ్ వచ్చినవారిని అనుమానితుల వార్డులో ఉంచవద్దని ఓ కరోనా అనుమానితుడి తండ్రి వైద్యులతో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. పాజిటివ్గా తేలిన ఇద్దరిని వేరే వార్డులోకి షిఫ్ట్ చేయడమో.. లేక తమ కుమారుడిని డిశ్చార్జి చేయడమో చేయాలని గొడవపడ్డట్టు సమాచారం. ఇదే క్రమంలో వైద్యులపై అతను దాడికి దిగినట్టు తెలుస్తోంది.
విషయం ఉస్మానియా సూపరింటెండ్ దృష్టికి వెళ్లడంతో నేరుగా ఆయనే రంగంలోకి దిగినట్టు చెబుతున్నారు. దాడి చేసినవారిని పిలిపించి మందలించినట్టు తెలుస్తోంది. అనంతరం వారితో వైద్యులకు క్షమాపణలు కూడా చెప్పించినట్టు సమాచారం. దీంతో ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఇద్దరు పాజిటివ్ పేషెంట్లను గాంధీకి తరలించినట్టు సమాచారం.
గత నెలలో గాంధీ ఆసుపత్రిలోనూ ఇదే తరహాలో దాడి జరిగింది. ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందడంతో... అదే వార్డులో చికిత్స పొందుతున్న అతని సోదరుడు వైద్యులపై దాడికి దిగాడు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. మరుసటి రోజు నుంచి గాంధీలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. ఇక ఇదే తరహాలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలోనూ వైద్య సిబ్బందిపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మహిళ వైద్యులు గాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇటీవల ఇద్దరు వైద్యులపై ఓ స్థానికుడు దాడికి పాల్పడటం కలకలం రేపింది. ఓవైపు ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ కరోనా మహమ్మారి నుంచి రక్షించేందుకు వైద్యులు కృషి చేస్తుంటే.. వారి పైనే దాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో వైద్యులపై దాడులను అరికట్టేందుకు భవిష్యత్తులో ఓ బిల్లును కూడా తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడితే మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేలా ఈ చట్టాన్ని రూపొందించనున్నారు.