Hyderabad: లంగర్ హౌస్ లో దారుణం.. రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి..
హైదరాబాద్ లోని లంగర్ హౌస్ లో దారుణం జరిగింది. ఓ కారు అతివేగంగా వచ్చి బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్కై వెళుతున్న దంపతులు కన్నుమూశారు. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా మోద్కురుకు చెందిన ప్రణయ్గా తేల్చారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోది.
కారు అతివేగంతో రావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత కారు డ్రైవర్ ప్రణయ్ పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడికి డ్రంక్ డ్రైవ్ టెస్ట్ చేయగా.. మద్యం తాగినట్లు తెలిసింది. మృతులను దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్లుగా పోలీసులు గుర్తించారు. దంపతులు బంజారాహిల్స్లోని నందినగర్లో నివాసం ఉంటున్నారని తెలిసింది. లంగర్ హౌస్లోని యాదవ బస్తీలో మోనా ఠాకూర్ తల్లిదండ్రులు వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

ప్రస్తుతం మొనా ఠాకూర్ రెండు నెలల గర్భిణిగా ఉన్నారు. దీంతో వారి కుటుంబం కన్నీరుమున్నీరు అయింది. మద్యం తాగి వాహనాలు నడపొద్దని ఎంత చెప్పినా పలువురు పట్టించుకోకుండా వాహనాలు నడుపుతున్నారని పోలీసులు చెబుతున్నారు. కాగా కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ఆదివారం ఉదయం కూకట్ పల్లి సమీపంలోని వై జంక్షన్ మెట్రో స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జ కాగా అందులోని వారికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. ఈ యాక్సిడెంట్ తో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. స్వల్పంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారును పక్కకు తప్పించారు.












Click it and Unblock the Notifications