వాట్సాప్ డీపీ పెట్టారో అంతే.. మహిళ ఫోటో న్యూడ్గా మార్చి.. ఒకరికి వేధింపులు
కపుల్ ఫోటోలు డీపీ పెట్టుకోవడం సహజమే.. దానికి కామెంట్ల కోసం.. ఎంత మంది చూశారు అని అనుకుంటారు. అయితే ఆ ఫొటోలను కూడా సైబర్ నేరగాళ్లు తీసుకుంటున్నారు. మార్పింగ్ చేసి.. బెదిరిస్తున్నారు. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడిని బెదిరించి.. రూ. లక్షలు వసూల్ చేశారు. బాధితుడు లబోదిబో మన్నాడు.

వాట్సాప్ డీపీ..
వాట్సాప్ డీపీగా తన భార్యతో దిగిన ఫొటోను పెట్టుకున్న వ్యక్తికి సైబర్ క్రిమినల్స్ ఊహించని షాక్ ఇచ్చారు. ఆ ఫొటోను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశారు. ఏకంగా అతడి నుంచి లక్ష రూపాయలకు పైగా డబ్బు గుంజారు. ఇంకా వేధింపులు ఆగలేదు. దీంతో బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ చిలకలగూడలో ఈ ఘటన జరిగింది.

మోసం మోసం...
సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో అమాయకులను చీట్ చేస్తున్నారు. వారి నుంచి డబ్బు దండుకుంటున్నారు. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి దిగిన ఫొటోను అందరిలానే వాట్సాప్ డీపీగా పెట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్ల చేతికి అడ్డంగా చిక్కాడు. వాట్సాప్ డీపీ నుంచి ఆ ఫొటోను డౌన్లోడ్ చేసుకున్న సైబర్ కేటుగాళ్లు అందులోని భార్య ఫొటోను మార్ఫింగ్ చేశారు. న్యూడ్ ఫొటోగా మార్చారు. ఆ తర్వాత దాన్ని భర్త ఫోన్కు పంపారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వారందరికీ ఈ ఫొటోలు పంపిస్తామని అతడిని బ్లాక్ మెయిల్ చేశారు. దీంతో సదరు వ్యక్తి బిత్తరపోయాడు. తన పరువు పోతుందని భయపడ్డాడు. మరో దారి లేక వారికి డబ్బు పంపాడు. అలా రెండు దఫాల్లో రూ.1.2 లక్షలను సైబర్ నేరగాళ్ల అకౌంట్కు ట్రాన్సఫర్ చేశాడు.

ఆగని వేధింపులు
డబ్బు పంపినా కేటుగాళ్ల వేధింపులు ఆగలేదు. ఇంకా డబ్బు పంపాలని డిమాండ్ చేశారు. వారి వేధింపులు భరించలేకపోయిన బాధితుడు హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇది తెలిసిన వాళ్ల పనే కావొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా విచారణ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా వేదికలో ప్రొఫైల్ పిక్స్, డీపీల్లో మహిళల ఫొటోలు పెట్టేవారిని హెచ్చరించారు. ఆ విధంగా మహిళల ఫొటోలు పెట్టకపోవటమే సేఫ్ అని సూచిస్తున్నారు.

జర జాగ్రత్త
తెలియని వారితో చాటింగ్లు, ఫోన్ మాట్లాడటం చేయొద్దని సూచించారు. అనుమానిత నెంబర్లను బ్లాక్ చేయాలని కోరారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా ధైర్యంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఏదిఏమైనా సోషల్ మీడియాతో జాగ్రత్తగా ఉండాలని, అప్రమత్తంగా ఉండటం అవసరమని పోలీసులు స్పష్టం చేశారు. లేదంటే కేటుగాళ్ల చేతిలో మోసపోవడం ఖాయం అని చెప్పారు.












Click it and Unblock the Notifications