హైదరాబాద్ లో డ్రగ్స్ దందా .. బంజారా హిల్స్ లో భారీగా పట్టుబడిన డ్రగ్స్, కూపీ లాగుతున్న పోలీసులు
హైదరాబాద్ నగరంలో చాప కింద నీరులా డ్రగ్స్ దందా కొనసాగుతోంది. భాగ్యనగరంలో డ్రగ్స్ దందాను అరికట్టడం కోసం పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు, నార్కోటిక్స్ అధికారులు ప్రత్యేకమైన దృష్టి సారించినప్పటికీ డ్రగ్స్ దందా నిర్వహించే గ్యాంగులు ఎవరికీ దొరక్కుండా తమ కార్యకలాపాలను సాగిస్తున్నారు.ఈ క్రమంలో తాజాగా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్ లో ఓ ఇంటిపై ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది.
ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి పెద్ద మొత్తంలో డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుండి పోలీసులు 17 గ్రాముల కొకైన్, 8 గ్రాముల ఎండీఎంఏ, 73 ఎక్స్టాసి పిల్స్, 15 గ్రాముల చరాస్ ను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరు ఒక నైజీరియన్ నుండి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. బాబు , సోలమన్ అనే ఇద్దరు వ్యక్తులు ఈ డ్రగ్స్ ను కొనుగోలు చేసి హైదరాబాద్ కేంద్రంగా విక్రయిస్తున్నట్లుగా తెలుస్తుంది.

వీరు ఒక గ్రాము కొకైన్ ను ఎనిమిది వేల రూపాయలకు అమ్ముతున్నట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వీరు బెంగళూరు, ముంబై నగరాల నుండి డ్రగ్స్ తీసుకువచ్చి హైదరాబాద్ లో వారికి విక్రయిస్తున్నట్లు గా గుర్తించారు.యెమన్ దేశస్థుడు తోపాటు మరో డ్రగ్ పెడ్లర్ ను అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద నుండి ఎనభై వేల రూపాయల నగదును, రెండు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు. వీరి సెల్ ఫోన్ లలోని డేటా ను పరిశీలిస్తున్న పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇక వీరికి డ్రగ్స్ ముఠాతో ఎవరెవరితో సంబంధం ఉంది అన్నదానిపై ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఇంకా వీరి దందా నగరంలో ఎక్కడ వరకు విస్తరించింది అన్నదానిపై కూపీ లాగుతున్నారు. వారి వద్ద నుండి డ్రగ్స్ సరఫరా ఎక్కడెక్కడికి జరుగుతుంది.. పెడలర్స్ గా ఎవరెవరు పని చేస్తున్నారు? డ్రగ్స్ వాడకం దారులు ఎవరు ? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.












Click it and Unblock the Notifications