తాగి డ్యూటీకొస్తే ఇంటికే..! విధుల్లోకొచ్చే ముందే పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..!!
హైదరాబాద్ : మద్యం మత్తులో గమ్మత్తుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు చెక్ పడబోతోంది. ఇక మీదట తాగి డ్యూటీలో ఉంటే ఇంటికి పంపించేందకు ప్రణాళికలు రచిస్తున్నారు పోలీసులు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లే సమయంలో మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించడం సహజం. కాని ఇప్పుడు సీన్ రివర్స్ అవుతోంది. విధుల్లోకి రాగానే సంతకం చేసేముందు డ్రంక్ టెస్టులు నిర్వహించి, మద్యం సేవించి లేడని తేలితే అనుమతిచ్చేట్టు, మద్యం సేవించి ఉన్నాడని తేలితే ఇంటికి పంపించేట్టు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో పోలీసు శాఖలో చాలా మంది ఉద్యోగులు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉద్యోగం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పోలీసులకు డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు..! రోజుకు రెండు సార్లు నిర్వహణ..!!
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు అనగానే మందుబాబులకు కోపం నషాలానికి అంటేది. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న చోదకులకు ట్రాఫిక్ పోలీసులు బ్రీత్ ఎనలైజర్తో పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేస్తుంటారు. వాహనాన్ని సీజ్ చేస్తారు. కౌన్సెలింగ్ నిర్వహించడంతోపాటు, న్యాయ స్థానంలో హాజరు పరుస్తారు. తాగిన మోతాదును బట్టి న్యాయస్థానం మందుబాబులకు ఒకటి నుంచి 6 రోజుల పాటు జైలు శిక్షను విధిస్తోంది. శిక్షా కాలం పూర్తయిన అనంతరం పోలీసులు వాహనాన్ని అప్పగిస్తారు.
కేసీఆర్ ఖర్చుపై రేవంత్ రెడ్డి లాజిక్..! అదిరిపోయే రహస్యాలు
డ్యూటీకి వచ్చినప్పుడు.. వెళ్లేటప్పుడు..! పరీక్షించాలన్న సీపీ మహేష్ భగవత్..!!
డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుబడింది మొదలు తిరిగి వాహనం చేతికి వచ్చే వరకు వాహనదారులు చుక్కలు చూడాల్సి వస్తోందనడంలో సందేహం లేదు. ఈ పోలీసుల పని బాగుంది. ఏం చేసినా అడిగేవారు లేరు. తాగి డ్యూటీకి వచ్చినా.. డ్యూటీలోనే తాగి ఇంటికి వెళ్లినా ఒంటిమీద ఖాకీ డ్రస్ ఉండటంతో అడిగేవారుండరు. చాలా సందర్భాల్లో పోలీసులకు పట్టుబడిన మందుబాబులు చర్చించుకునే మాట. కొన్ని సందర్భాల్లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న క్రమంలో కొందరు పోలీసుల వద్ద మద్యం వాసన వస్తోందని వాహనదారులు అరోపించేవారు. సామాన్య వాహనదారులపైనే పోలీసులు ప్రతాపం చూపిస్తారని, ఇలా తాగి డ్యూటీకి వచ్చే పోలీసుల గురించి పట్టించుకునే వారెవరనే విమర్శలు వచ్చాయి.
రాచకొండలో వినూత్నంగా..! ఎవరికీ మినహాయింపు లేదంటున్న ఉన్నతాదికారులు..!!
కొన్ని పోలీసు స్టేషన్లలో పోలీసులు మద్యం తాగి డ్యూటీకి వస్తున్నారని, వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో మద్యం తాగుతున్నారని, తిరిగి డ్యూటీ దిగి వెళ్లేటప్పుడు మద్యం మత్తులోనే ఇంటికి వెళ్తున్నారని ఇలా పోలీసులపై అనేక రకాల ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు ఉదయం డ్యూటీకి వచ్చినప్పుడు ఒకసారి, విధులు ముగించుకొని ఇంటికి వెళ్లేటప్పుడు మరోసారి బ్రీత్ ఎనలైజర్తో శ్వాస పరీక్షలు చేయాలని సూచించారు. దాంతో మంగళవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసులు శ్వాసపరీక్షలు నిర్వహించారు.
దొరికితే ఇంటికే..! జీతం కూడా కట్టే..!!
మద్యం తాగి విధుల్లోకి వచ్చినా.. వచ్చిన తర్వాత మద్యం తాగినట్లు తేలినా ఆ అధికారిపై సీపీ మహేష్ భగవత్ కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఎవరైనా పోలీస్ అధికారి మద్యం తాగినట్లు పరీక్షల్లో తేలితే నేరుగా ఇంటికి సాగనంపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలో సామాన్య ప్రజలకు ఒక న్యాయం, పోలీసులకు మరో న్యాయం అనే తేడా ఉండదు. తప్పు చేసింది పోలీసులైనా, సామాన్యులైనా శిక్ష ఒకే విధంగా ఉంటుందన్నమాట. సీపీ తీసుకున్న ఈ నిర్ణయంపై పోలీసు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.