డిప్యూటీ మేయర్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, ఎన్ఎస్యూఐ నేతపై ఫిర్యాదు
హైదరాబాద్ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోంది. ఓ స్థల వివాదంలో జోక్యం చేసుకోవడంతో స్థానికులు దాడి చేశారని ట్రోల్ అవుతోంది. అయితే దీనిని టీఆర్ఎస్ నేతలు ఖండించారు. బోరబండ వీకర్ సెక్షన్ కాలనీవాసులు... జరుగుతోన్న అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు.
బోరబండ వీకర్ సెక్షన్ కాలనీవాసులు సోమవారం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల బోరబండలో స్థల వివాదం నెలకొందని కంప్లైంట్లో వివరించారు. అందులో ఒక వర్గానికి ఫసీయుద్దీన్ అండగా నిలిచారని.. మరో వర్గం దాడి చేసిందని తెలిపారు.
కానీ వాస్తవానికి స్థల వివాదంలో ఫసీయుద్దీన్ కల్పించుకోలేదని స్పష్టంచేశారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది ఎన్ఎస్యూఐ నేత స్వామి అని వారు ఆరోపించారు. చట్టప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో స్థానికులు సత్యనారాయణ, ఇతరులు ఉన్నారు.
కాలనీవాసుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ ప్రారంభించామని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు. మరోవైపు డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్పై అసత్య ప్రచారం చేస్తున్నారని టీఆర్ఎస్వీ నేతలు కూడా మండిపడ్డారు. తప్పుడు ప్రచారం చేసినవారిపై చర్యలు తీసకోవాలని సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు.