హైదరాబాద్లో హోరెత్తిన వరద బాధితుల నిరసనలు.. కష్టాల్లో ఉంటే కమీషన్లు అడుగుతున్నారని ఆరోపణలు...
ఇటీవల హైదరాబాద్ వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం పక్కదారి పడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలైన బాధితులకు సాయం అందట్లేదని నగరంలోని చాలాచోట్ల శనివారం(అక్టోబర్ 31) బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. వరద సాయం పేరుతో స్థానిక నాయకులే జేబులు నింపుకుంటున్నారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కొన్నిచోట్ల వరద సాయం కోసం నాయకులు కమిషన్లకు అడుగుతున్నారని ఆరోపిస్తున్నారు.
అంబర్పేటలో ఉద్రిక్తత...
హైదరాబాద్తో పాటు మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల్లోని పలుచోట్ల వరద బాధితులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అంబర్పేట్లో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటి వద్ద మహిళలు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా గోల్నాకకు చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించడంతో తీవ్ర కలకలం రేగింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు.

వరద సాయం నిలిపివేయడంతో...
హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయాల ఎదుట వరద బాధితులు గత నాలుగైదు రోజులుగా ధర్నాలకు దిగుతున్నారు. అధికారులు,కార్పోరేటర్లు వరద సాయాన్ని కాజేశారని ఆరోపిస్తున్నారు. వరద బాధితుల ఆందోళనలు ఉధృతమవడంతో జీహెచ్ఎంసీ వరద సాయం పంపిణీ నిలిపివేసింది. అయితే సాయం అందుకోని అసలైన బాధితులకు త్వరలోనే రూ.10వేలు ఇస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ వెల్లడించారు. ఈ సమాచారం బాధితులకు చేరకపోవడంతో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.
టీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు..
శనివారం హైదరాబాద్లోని హిమాయత్ నగర్,సైదాబాద్,చాంద్రాయాణ గుట్ట,సరూర్ నగర్,షేక్పేట్,మూసాపేట్,ఖైరతాబాద్,ఉప్పల్,రామాంతపూర్,అంబర్పేట,నేరెడ్మెట్ తదితర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగాయి. మూసాపేట్కు చెందిన ఓ వరద బాధితుడు మాట్లాడుతూ... 'ఇక్కడి మురికివాడ మొత్తం మొన్నటి వరదలకు ముంపుకు గురైంది. కానీ మాలో ఒక్కరికి కూడా ఇంతవరకూ సాయం అందలేదు. టీఆర్ఎస్ నాయకులు తమ సన్నిహితులైనవారికి మాత్రమే డబ్బు పంపిణీ చేస్తున్నారు. ప్రతీ డివిజన్కు ప్రభుత్వం రూ.3కోట్లు ప్రకటించింది. కానీ ఆ డబ్బంతా టీఆర్ఎస్ నాయకుల ఇళ్లకు చేరింది.' అని ఆరోపించారు.
వరద బాధితులకు సాయం ప్రకటించిన ప్రభుత్వం...
ఇటీవలి భారీ వర్షాలకు హైదరాబాద్ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. చాలాచోట్ల ఇళ్లల్లోకి నీళ్లు చేరి వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి.ఈ నేపథ్యంలో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం, ఇల్లు పూర్తిగా దెబ్బతింటే రూ.1లక్ష, పాక్షికంగా దెబ్బతింటే రూ.50వేలు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ పరిహారం తమకు అందట్లేదని వరద బాధితులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఇంటి యజమానులే ఆ డబ్బులు తీసుకుంటున్నారని... దాంతో అద్దెకు ఉన్న కుటుంబాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications